Share News

విద్యుత్‌ కొనుగోలు ధర యూనిట్‌ రూ.4కు తగ్గాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Mar 24 , 2026 | 08:46 PM

విద్యుత్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సంస్థలకు పెను భారంగా మారిన అప్పులను తగ్గించి.. ఛార్జీలు పెంచకుండా అప్పులు తీర్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

విద్యుత్‌ కొనుగోలు ధర యూనిట్‌ రూ.4కు తగ్గాలి: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు సీఎం. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గించే అంశంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఆ దిశగా చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించటం సహా ప్రజలపై భారం వేయకుండా విద్యుత్ సంస్థల రుణాలు తీర్చేందుకు కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.


రాష్ట్రంలో 2028-29 నాటికి విద్యుత్ కొనుగోళ్ల వ్యయాన్ని తగ్గించేందుకు చేపట్టిన ప్రణాళికలను విద్యుత్ శాఖ అధికారుల ముందుంచారు ముఖ్యమంత్రి. విద్యుత్ రంగంలోని వివిధ విభాగాలలో సంస్కరణలు చేస్తే.. మొత్తంగా యూనిట్‌కు రూ.1.32 చొప్పున విద్యుత్ కొనుగోలు భారాన్ని తగ్గించవచ్చని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 2028-29 నాటికి యూనిట్ కొనుగోలు ధరను రూ.4.10కు తెచ్చేలా చర్యలు చేపట్టామని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ.. కొనుగోలు ధర రూ.4గా ఉండేలా తగ్గించాలన్నారు. నూతన టెక్నాలజీని, ఇన్నోవేషన్లను ఉపయోగించుకుని విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాలని అధికారులకు వివరించారు.

విద్యుత్ సంస్థలను సమర్థవంతంగా నిర్వహించడంతో 2025-26 ఆర్థిక ఏడాదికి సుమారు రూ.339 కోట్ల వరకు ఆదా చేశామని సీఎం అన్నారు. ఈ తరహా పొదుపు చర్యలను మరిన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సంస్థలకు పెను భారంగా మారిన అప్పులను తగ్గించి.. ఛార్జీలు పెంచకుండా అప్పులు తీర్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.


ఇవీ చదవండి:

యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రబావం ఉంది: మోదీ

క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Updated Date - Mar 24 , 2026 | 08:50 PM