అమరావతి అభివృద్ధిలో రైతుల సహకారం కీలకం: మంత్రి నారాయణ
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:58 PM
అమరావతిలో రైల్వే లైన్ రింగు రోడ్డు కోసం భూములు అవసరమని, రైతులు త్వరగా భూ సమీకరణకు వస్తే పనులు చేపడతామని మంత్రి నారాయణ చెప్పారు. తాడికొండ నుంచి రాజధాని వెళ్లే రోడ్డు పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు.
గుంటూరు, జులై 22: అమరావతి రైల్వే లైన్, ఇన్నర్ రింగు రోడ్డు, రాజధాని రేడియల్ రోడ్లకు భూ సమీకరణకు సంబంధించి తాడికొండలో సీఆర్డీఏ ఆధ్వర్వంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2015లో భూ సమీకరణ మొదలైనా.. పనులు మాత్రం 2018లో మొదలయ్యాయని తెలిపారు. జగన్ హయాంలో ఐదేళ్లు పనులు జరగలేదన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. నిర్మాణాలు పూర్తైన భవనాలను అతి త్వరలోనే వినియోగంలోకి తెస్తున్నామని తెలిపారు. ఇప్పుడు రైల్వే లైన్, రింగు రోడ్డు కోసం భూములు అవసరమని, రైతులు త్వరగా భూ సమీకరణకు వస్తే పనులు చేపడతామని చెప్పారు. తాడికొండ నుంచి రాజధాని వెళ్లే రోడ్డు పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు.
తాడికొండ, కంతేరు, మోతడక, కొప్పురావూరు గ్రామాల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్ వెళ్తుందని మంత్రి తెలిపారు. ల్యాండ్ అక్విజిషన్కు వెళ్లాలా లేక పూలింగ్కు వెళ్లాలా అనే దానిపై రైతుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. గ్రామసభలో మెజారిటీ రైతులు ల్యాండ్ పూలింగ్కు అంగీకారం తెలిపారని చెప్పారు. 50 ఎకరాల భూమికి రైతులు ఇప్పటికే పత్రాలు సమర్పించారని.. వారి సందేహాలన్నింటికీ ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు. రైతులకు అనువైన చోటే రిటర్న్ ప్లాట్లు ఇస్తామని వెల్లడించారు. రెండు, మూడు లేఅవుట్ డిజైన్లు చూపించి రైతుల అభిప్రాయం మేరకు ప్లాట్లు కేటాయిస్తామన్నారు.
2027 మార్చి నాటికి 350 కి.మీ ట్రంక్ రోడ్లు పూర్తవుతాయని, 2027 చివరి నాటికి అమరావతి లేఅవుట్లు పూర్తి చేస్తామని నారాయణ ప్రకటించారు. ఈ నెల(జులై) 25న ఎమ్మెల్యే క్వార్టర్స్ను ప్రభుత్వానికి అప్పగిస్తామని, వచ్చే నెల 15న ఎమ్మెల్సీ క్వార్టర్స్, సెప్టెంబర్ మొదటి వారంలో మంత్రుల నివాసాలను అప్పగిస్తామన్నారు. ప్రతి 15 రోజులకు సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారని, అమరావతి పనులపై ప్రతిరోజూ తాను కూడా సమీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ల్యాండ్ పూలింగ్ వేగంగా పూర్తైతే ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్ పనులను వెంటనే ప్రారంభిస్తామన్నారు. రైల్వే శాఖ.. పనులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ వెంట సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులు త్వరగా భూములు ఇస్తే అంతే త్వరగా ప్లాట్లు కేటాయిస్తామన్నారు. అమరావతి అభివృద్ధిలో రైతుల సహకారం కీలకమని తెలిపారు. ల్యాండ్ పూలింగ్కు సహకరించిన రైతులకు మంత్రి నారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
మంగళగిరి అభివృద్ధి కోసం చంద్రబాబుతో గొడవ పెట్టుకున్నా: మంత్రి లోకేశ్
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రండి.. ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం
Read Latest AP News And Telugu News