Year Ender 2025: అసెంబ్లీ ఎన్నికలు.. సత్తా చాటిన బీజేపీ
ABN , Publish Date - Dec 23 , 2025 | 10:15 AM
ఈ ఏడాది రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒకటి న్యూఢిల్లీ కాగా.. మరొకటి బిహార్. న్యూఢిల్లీలో బీజేపీ గెలిస్తే... బిహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.
ఈ ఏడాది దేశంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఒకటి దేశ రాజధాని న్యూఢిల్లీ, మరొకటి బిహార్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఈ ఏడాది ప్రారంభం ఫిబ్రవరిలో జరిగాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఈ ఏడాది చివరిలో అంటే నవంబర్లో జరిగాయి. ఈ రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో.. న్యూఢిల్లీలో దశాబ్ధాలపాటు పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనకు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది.
బిహార్. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. ఈ రాష్ట్రంలో 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయే కూటమి తన సత్తా చాటింది. దీంతో భాగస్వామ్య పక్షమైన జేడీ (యూ) అధినేత నితీష్ కుమార్ వరుసగా మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం.
న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..
మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు..
ఫిబ్రవరి 5వ తేదీన (ఒకే విడతలో..) పోలింగ్ జరిగింది.
ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
ఎన్నికలు ఫలితాలు..
బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది.
ఆప్ 22 స్థానాలను గెలుచుకుంది.
కాంగ్రెస్ పార్టీతోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయారు.
ఆప్ ఓటమికి ఇదే కారణమా..?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఆప్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తూ వస్తోంది. దాంతో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపడుతూ వస్తున్నారు. కానీ ఢిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణంలో.. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తోపాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సైతం తీహార్ జైలు వెళ్లా్ల్సి వచ్చింది. దాంతో మనీష్ సిసోడియా ముందే మంత్రి పదవికి రాజీనామా చేసి.. జైలుకు వెళ్లారు. కానీ సీఎం పదవికి మాత్రం కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు.
బెయిల్ కోసం వారు చేసుకున్న దరఖాస్తులను సైతం కోర్టు తోసిపుచ్చింది. చివరకు ఎన్నికల ముందు బెయిల్పై వీరు విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ లక్ష్యంగా చేసుకుని బీజేపీ విమర్శలు సంధించింది. దీంతో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా.. ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానంటూ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి.. కేజ్రీవాల్ కేబినెట్లో విద్యా శాఖ మంత్రిగా పని చేసిన అతిషిని ఎంపిక చేశారు. ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు.
మరోవైపు తనపై సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది దాడి చేశారంటూ ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మల్వాల్.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చాడు. బీజేపీ అత్యధికంగా అంటే.. 48 స్థానాలను కైవసం చేసుకుంది. సీఎంగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ .. అధికారాన్ని కోల్పోవడమే కాదు.. ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలవలేక పోయారు. అలా కేజ్రీవాల్ అసెంబ్లీలోకి సైతం అడుగు పెట్టలేకపోవడం గమనార్హం.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు..
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి.
నవంబర్ 6వ తేదీ తొలి దశలో 121 స్థానాల్లో పోలింగ్
నవంబర్ 11వ తేదీన.. తుది దశలో 122 స్థానాల్లో పోలింగ్
నవంబర్ 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
ఎన్నికల ఫలితాలు..
ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు.. గెలిచిన స్థానాలు..202
బీజేపీ 89 స్థానాలను కైవసం చేసుకుంది.
జేడీ (యూ) 85 స్థానాలను గెలుచుకుంది
లోక్ జనశక్తి రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ 19 స్థానాలు
హెచ్ఏఎం (ఎస్) 5 స్థానాలు
రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) 4 స్థానలు
మహాఘట్ బంధన్లోని పార్టీలు.. 34 స్థానాలు
ఆర్జేడీ 25 స్థానాలు గెలుచుకుంది.
కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో విజయం సాధించింది.
లెఫ్ట్ పార్టీలు 3
ఇతరులు ..
ఎంఐఎం 5,
ఇతరులు 2
బిహార్ ప్రజలు.. వరుసగా ఎన్డీయే కూటమికి జేజేలు పలుకుతున్నారు. 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎన్డీయే కూటమికి బిహార్ ప్రజలు మరోసారి మద్దతు పలికారు. దాంతో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి కొలువుదీరింది. ఇక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతోపాటు రాష్ట్రంలోని నితీష్ ప్రభుత్వం చేపట్టిన విధానాలకు ప్రజలకు మద్దతు పలికినట్లు ఈ ఎన్నికలతో మరోసారి స్పష్టమైంది. అదీకాక ఎన్నికల ముందు రాష్ట్రంలోని మహిళల ఖాతాల్లో రూ. 10 వేలు చొప్పున ప్రభుత్వం వేసింది. ఇది కూడా ఎన్డీయే గెలుపు విజయవకాశాలకు దోహదం చేసింది.
ఇక ఎన్నికల ముందు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిహార్లో ర్యాలీ సైతం నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అలాగే మహాఘట్ బంధన్లో భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ సైతం పలు కీలక హామీలు ప్రకటించింది. ఈ మహాఘట్ బంధన్.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ పేరును ప్రకటించింది. అదీకాక లాలూ కుటుంబంలోని లూకలుకలతోపాటు ఆ పార్టీ గతంలో అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు, అరాచకాలు బిహారీల గుండెల్లో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో 2025 ఎన్నికల్లో వారు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని వచ్చిన ఫలితాల ద్వారా వెల్లడవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాచకొండ పరిధిలో పెరిగిన క్రైమ్: సీపీ సుధీర్ బాబు
విదేశాల్లో ఉన్నత చదువులు.. 2025లో మారిన వీసా రూల్స్ ఇవే..
For More Year Ender 2025 News And Telugu News