Telangana Govt: వైన్ షాపులు బంద్.. ఎందుకంటే..
ABN , Publish Date - Jul 10 , 2025 | 07:31 PM
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం తాత్కాలికంగా షాక్ ఇచ్చింది. వైన్ షాపులు మూసివేస్తున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి నగర సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, జులై 10: మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్లో బోనాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జులై 13వ తేదీ ఉదయం 6:00 నుండి 15వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్ పరిధిలోని వైన్స్ షాపులు, బార్లు బంద్ ఉంటాయని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి జాతర (బోనాలు) సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో గాంధీ నగర్ డివిజన్.. అలాగే ఈస్ట్ జోన్ పరిధిలో చిలకలగూడ డివిజన్లోని చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ.. అదే విధంగా నార్త్ జోన్ పరిధిలో బేగంపేట డివిజన్, గోపాలపురం డివిజన్ పరిధిలో గోపాలపురం, తుకారాం గేట్, మారేడుపల్లితోపాటు మహంకాళి డివిజన్ అంటే.. మహంకాళి, రామ్గోపాల్పేట, మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపులన్నీ మూసి ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో వివరించారు.
ఆషాఢ మాసం ప్రారంభమైంది. తెలంగాణలో బోనాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బోనాలు నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. నగరంలోని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News