Kalvakuntla Kavitha: సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే.. అవినీతిపై సీబీఐకి కంప్లైంట్ చేస్తాం: కల్వకుంట్ల కవిత
ABN , Publish Date - Sep 12 , 2025 | 07:52 PM
సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమేనని కవిత అన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై సీబీఐకి కంప్లైంట్ చేస్తామని.. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ను ముట్టడిస్తామని..
హైదరాబాద్, సెప్టెంబర్ 12: సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై సీబీఐకి కంప్లైంట్ చేస్తామని ఆమె తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్(HMS) – సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం (ఏబీ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యవర్గ సమావేశం) జరిగింది. ఇటీవల హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఈ సమావేశంలో ప్రసంగించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని కవిత ఆరోపించారు. రాబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్ఎంఎస్ జెండా ఎగురబోతోందని ఆమె జోస్యం చెప్పారు. అవినీతిని కట్టడి చేయకుంటే సింగరేణి భవన్ను ముట్టడిస్తామని కవిత హెచ్చరించారు. 'కాంగ్రెస్ అంటేనే కరెప్షన్ పార్టీ. సింగరేణిలో తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారు. ప్రతి కాంట్రాక్ట్ లో 25 శాతం అవినీతి జరుగుతోంది. 10 శాతం వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోంది. ప్రభుత్వం స్పందించకుంటే మేమే సీబీఐ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. కార్మికుల బాగు కోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నా' అని కవిత అన్నారు.
టీబీజీకేఎస్(TBGKS) అనేది మొన్న ఎన్నికల్లో పోటీనే చేయలేదని చెప్పిన కవిత.. గుర్తింపు సంఘం అనుకుంటున్న వాళ్లు.. వాపును చూసి బలుపు అనుకుంటున్నారని విమర్శించారు. 'నిజానికి సింగరేణి ఎన్నికల్లో వాళ్లకు గెలిచేంత సీన్ లేదు. సింగరేణిలో ఇప్పుడున్న ఎర్రజెండా కాకుండా మరొక జెండా ముందుకు రాబోతోంది. హెచ్ఎంఎస్, జాగృతి సంస్థలు మొత్తం 40వేల మంది సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తాయి. గతంలో కేసీఆర్ చెప్పారనే టీబీజీకేఎస్ కు ఓటు వేశారు. కేసీఆర్ ఇప్పుడు అధికారంలో లేరు. సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పుడున్న టీబీజీకేఎస్ నాయకులు ఎందుకు పోరాటం చేయటం లేదో కార్మికులకు సమాధానం చెప్పాలి. ప్రతిక్షణం కార్మికుల కోసం ఫీల్డ్ లో ఉండి పనిచేసే వారి కార్మిక సంఘమే గెలుస్తుంది. టీబీజీకేఎస్ నాయకులు అవినీతి చేయొద్దని గతంలో నేను ఎన్నోసార్లు చెప్పా. అయినా నాయకులు స్వార్థంతో అవినీతి చేశారు. కార్మిక సంఘాల్లో యువతను ప్రోత్సహించాలని కోరినా పట్టించుకోలేదు. సింగరేణి కార్మికులకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. దీని మీద టీజీబీఎస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు?' అని కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.
'నిన్నటి దాకా ఉన్న సంఘంపైనే విమర్శలు ఏంటనీ కొందరు అనవచ్చు.. కానీ అక్కడ జరిగిన పరిస్థితులపై కచ్చితంగా మాట్లాడాల్సిన అవసరముంది. సింగరేణి సంస్థను కేసీఆర్ కన్నబిడ్డలా చూసుకున్నారు.. వారి మార్గంలోనే హెచ్ఎంఎస్ కూడా పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి తీరుకు వ్యతిరేకంగా కొట్లాడుదాం. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు కొత్త కొర్రీలు పెడుతున్నారు. పదో తరగతి పాస్ కాలేదంటూ 470 అప్లికేషన్స్ ఆపేశారు. చదువుతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలను నియమించాలి. రాష్ట్రంలో ఉన్న మైన్స్, మినరల్స్ ను వినియోగించుకొని ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించాలి. సింగరేణి ప్రాంత ప్రజలకు దక్కాల్సిన నిధులను దారి మళ్లిస్తున్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.42వేల కోట్ల బకాయిలు పెట్టి నష్టాల్లోకి నెట్టేస్తోంది.. ఇలా చేస్తే సంస్థ భవిష్యత్ ఏం కావాలి?. గతంలో సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచుకోలేకపోయాం. దానికి పరిష్కారంతోపాటు మెడికల్ బోర్డు తెచ్చుకునేందుకు పోరాటం చేద్దాం. సింగరేణిలో పనిచేయటమంటేనే ఎంతో రిస్క్ తో కూడుకున్నది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే వారికి పూర్తిస్థాయిలో భద్రత ఉండదు. సంస్థలో డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ విధానం కొనసాగాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ను మనుషులే కాదన్నట్లుగా చూస్తున్నారు. గతంలో నేను వారికి మినిమమ్ వేజేస్ వచ్చేలా కృషి చేశా. సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే. మహిళా కార్మికుల సంక్షేమం, వారి వసతుల కోసం కూడా పోరాటం చేద్దాం. హెచ్ఎంఎస్ లో సభ్వత్యాలు పెంచాలి. ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ కూడా పెట్టుకుందాం. హెచ్ఎంఎస్, జాగృతి రెండు కళ్లలా పనిచేస్తాయి. హెచ్ఎంఎస్, జాగృతి కొత్త కాంబినేషన్. అదే విన్నింగ్ కాంబినేషన్ కాబోతుంది' అని కవిత చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి..
మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
For More National News and Telugu News