Share News

KTR Tweet: ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్‌కు చెంపపెట్టు.. కేటీఆర్ సంచలన ట్వీట్

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:53 PM

పంచాయతీ ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల విజయంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. వారికి విషెస్ తెలియజేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ సర్కార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

KTR Tweet: ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్‌కు చెంపపెట్టు.. కేటీఆర్ సంచలన ట్వీట్
KTR Tweet

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఇక కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని తమ ఓటు ద్వారా పల్లె ప్రజలు చెప్పారని అన్నారు. తెలంగాణ బతుకుచిత్రాన్ని ఛిద్రంచేస్తున్న రేవంత్‌కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, రిక్త హస్తం అని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.


కేటీఆర్ ట్వీట్..

‘రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సత్తాచాటిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రత్యేకంగా అభినందనలు. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చిచెప్పారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనం. రేవంత్ రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలకు తోడు, గ్యారెంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే, కాంగ్రెస్‌కు ఉరితాళ్లుగా మారి ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయి. పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే, ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదు. అరాచక పాలనతో తెలంగాణ బతుకుచిత్రాన్ని ఛిద్రం చేస్తున్న రేవంత్ రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివి’ అంటూ ట్వీట్ చేశారు.


‘నాడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే, నేడు కాంగ్రెస్ సగం పంచాయతీలను కూడా గెలవకపోవడం, పల్లె పల్లెనా అధికారపార్టీపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతం. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, రిక్త హస్తం అని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిన నేపథ్యంలో ఇక సీఎం రేవంత్ అసమర్థ పాలనలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం కాయం. రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అరాచకాలు, మోసాలు, అవినీతి కుంభకోణాలపై అనునిత్యం బీఆర్ఎస్ సాగిస్తున్న సమరాన్ని గుండెల నిండా ఆశీర్వదిస్తున్న తెలంగాణ సమాజానికి శిరస్సు వంచి పాదాభివందనలు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ కబందహస్తాల నుంచి విడిపించే ఈ పోరాటాన్ని తమ భుజాలపై మోస్తున్న గులాబీ సైనికులను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కష్టకాలంలో బీఆర్ఎస్ వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా పార్టీ బంగారు బాటలు వేస్తుంది’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

హైదరాబాద్‌లో మరో హత్య.. భయాందోళనలో ప్రజలు

ఓడిపోయిన అభ్యర్థిని ట్రాక్టర్‌‌తో ఢీకొట్టిన సర్పంచ్ తమ్ముడు.. ఏం జరిగిందంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 15 , 2025 | 02:03 PM