Nowhera Shaik: నౌహీరా షేక్ ఆస్తుల వేలం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ
ABN , Publish Date - Oct 14 , 2025 | 08:48 AM
ఆక్షన్లో పాల్గొంటున్న వారిపై నౌహీరా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నౌహీరా చర్యలపై ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
హైదరాబాద్: హీరా గ్రూప్ సంస్థల అధినేత్రి నౌహీరా షేక్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈడీ అటాచ్లో ఉన్న ఆస్తులను విక్రయించేందుకు నౌహీరా షేక్ ప్రయత్నాలు చేసింది. మరోవైపు నౌహీరా షేక్ ప్రాపర్టీస్ను ఈడీ వేలం వేస్తోంది. ఈడీ జప్తులో ఉన్న ఆస్తులను అమ్మి నౌహీరా ఇప్పటికే రూ.3 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. జప్తులో ఉన్న ఆస్తులను విక్రయించేందుకు ఒక సబ్ రిజిస్టర్ సైతం హీరాకు సహాయపడ్డాడని ఈడీ ఆరోపణ చేస్తోంది. మరోవైపు వేలం ద్వారా రూ.93 కోట్లు ఆస్తులను ఈడీ ఆక్షన్ వేసింది.
అయితే ఆక్షన్లో పాల్గొంటున్న వారిపై నౌహీరా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నౌహీరా చర్యలపై ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నౌహీరాను ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో అరెస్ట్ చేయాలని సుప్రీం పేర్కొంది.
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే ఏడాదికి 36 శాతం లాభాలు వస్తాయని నమ్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రజలను మోసం చేశారన్న ఫిర్యాదులపై నౌహీరా షేక్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు లక్షలాది మంది డిపాజిటర్ల నుంచి రూ.వేల కోట్లు కాజేసిన నౌహీరా వాటిని విదేశాలకు మళ్లించేందుకు సమకూర్చుకున్న పలు పత్రాలు, డిజిటల్ ఆధారాలు సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు.
నౌహీరాతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఉన్న రూ.45 కోట్ల విలువైన 13 ఆస్తుల పత్రాలు, బినామీల పేరిట ఉన్న రూ.25 కోట్ల విలువైన 11 ఆస్తుల పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.వేల కోట్ల నిధుల గోల్మాల్ కేసులో ఈడీ ఇప్పటికే నౌహీరా షేక్కు సంబంధించిన సుమారు రూ.400 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలో నౌహీరా షేక్ ఆస్తులను ఈడీ వేలం వేస్తుంది.
ఇవి కూడా చదవండి..
Government Policy: బాబోయ్ ఇథనాల్
TCS CEO Kriti Vasudevan: కొత్తగా హెచ్-1బీ ఉద్యోగులను నియమించం టీసీఎస్ సీఈవో కృతివాసన్ వెల్లడి