KTR: రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలకు అలాంటి పరిస్థితి ఉంది.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Feb 08 , 2025 | 02:34 PM
KTR: సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. 8మంది చొప్పున కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తెచ్చింది శూన్యమని విమర్శించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని.. ఒక వేళ వెళ్తే ప్రజలు తరిమి కొడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. . ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదని చెప్పారు. ప్రజలు తిడుతున్న తిట్లకు రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్లు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారని ఆరోపించారు. తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లను ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని చెప్పారు. సిర్పూర్ కాగజ్నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్లో జరిగింది. స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
140ఎకరాల భూమి కోసం కొడంగల్ల్లోని ఒక ఊరికి 450మంది పోలీసులను సీఎం రేవంత్ పంపించారని ఆరోపించారు. తెలంగాణలో పేదవాళ్లు బతుక వద్దా అని ప్రశ్నించారు. ఖచ్చితంగా వాళ్ల ఇళ్లను, దుకాణాలను రేవంత్ రెడ్డి కూలగొడతారని అన్నారు. అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుకు వెళ్తాడని.. కేసీఆర్ కూడా తప్పకుండా తిరిగి ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వస్తారని తెలిపారు. సిర్పూర్ కాగజ్నగర్తో తనకు వ్యక్తిగతంగా అనుబంధం ఉందని తెలిపారు.
కాగజ్ నగర్లో బీఆర్ఎస్ను బలోపేతం చేశామని అన్నారు. కాగజ్గర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేశానని గుర్తుచేశారు. కేసీఆర్తోనే బహుజనుల అభివృద్ధి జరుగుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్మారని తెలిపారు. 8మంది చొప్పున కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తెచ్చింది శూన్యమని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పినా.. ఒక్క కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. లోక్సభలో తాము ఉండుంటే కేంద్ర ప్రభుత్వంపై కోట్లాడే వారమని కేటీఆర్ తెలిపారు.