KTR: మాటలకందని మహావిషాదం.. తెలంగాణ చెల్లించిన భారీ మూల్యం..
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:51 PM
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రుణమాఫీని ఆగంచేసి.. పెట్టుబడి సాయానికి పాతరేసి.. ముంచేరోజులు తేవడంవల్లే రాష్ట్రంలో ఈ అనర్థాలని ఆయన అన్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President ), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR).. రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Govt.)పై సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘42 అబద్ధపు హామీల పాపం.. 420 రోజుల చేతకాని పాలన శాపం.. ఫలితంగా.. మాటలకందని మహావిషాదం.. తెలంగాణ చెల్లించిన భారీ మూల్యం.. 420 మంది రైతన్నల బలవన్మరణం.. అసమర్థులు అధికారం పీఠమెక్కి..అన్నదాతలను బలిపీఠం ఎక్కిస్తున్నారు’’.. అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.
ఈ వార్తలను చదవండి..
మహిళ పెట్రోల్ బాటిల్తో హల్ చల్
కౌలు రైతులూ పిట్టల్లా రాలిపోతున్నారు..
కన్నీటి సేద్యం చేయలేక.. భూములున్న కర్షకులే కాదు.. కౌలు రైతులూ పిట్టల్లా రాలిపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికే వెన్నుముకైన రైతులకు... కుటిల కాంగ్రెస్ పాలనలో వరుస వెన్నుపోట్లు పొడుస్తున్నారని, ఓట్లనాడిచ్చిన హామీలకు లెక్కలేనన్ని తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పంజాబ్నే తలదన్నే స్థాయికి తెలంగాణను తీసుకువస్తే.. ఇప్పుడు పెట్టుబడికి పత్తాలేదు.. దిగుబడికి దిక్కులేదంటూ ఆయన విమర్శించారు.
రుణమాఫీని ఆగంచేసి.. పెట్టుబడి సాయానికి పాతరేసి.. ముంచేరోజులు తేవడంవల్లే ఈ అనర్థాలని కేటీఆర్ అన్నారు. చలనం లేని సీఎం, బాధ్యత లేని సర్కారు వల్లే.. మళ్లీ తెలంగాణ పల్లె కన్నీరుపెడుతోందన్నారు. మళ్లీ మరణమృదంగం మోగుతోందని.. ఈ ప్రభుత్వానికి చేతనైతే.. ఇకనైనా సాగు సంక్షోభాన్ని తీర్చాలని.. అన్నదాతల ఆత్మహత్యల పరంపరను ఆపాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు
కాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదని, తెలంగాణలో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. గురువారం పార్లమెంట్ ఎదుట విజయ్ చౌక్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇటీవలే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని, వారికి నోటీసులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడేలా సుప్రీంకోర్టులో కొట్లాడతామన్నారు. అంతకుముందు ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం సమావేశమైంది. సిరిసిల్ల వరకు నిర్మాణమవుతున్న జాతీయ రహదారి 365-బీని వేములవాడ నుంచి కోరుట్ల వరకు విస్తరించాలని గడ్కరీని కోరామన్నారు. మిడ్ మానేరు మీదుగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిను ఏర్పాటు చేసి వేములవాడ మీదుగా కోరుట్లలో జాతీయ రహదారి 63ని దానితో అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.
యూజీసీ నూతన నిబంధనలు రూపొందించాలి..
రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను గవర్నర్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన అధీనంలోకి తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్థమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్లకు అప్పగించడం సరికాదన్నారు. దేశంలో రాష్ర్టాల హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్థంగా నిబంధనలు తెస్తే సహించేది లేదన్నారు. యూజీసీ నిబంధనల్లో మార్పులపై బీఆర్ఎస్ నేతృత్వంలోని ఆరు పేజీలతో కూడిన విద్యారంగ నిపుణుల సలహాలు, సూచనలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటీఆర్ అందజేశారు. రాష్ర్టాల స్వయం ప్రతిపత్తి హక్కులకు భంగం వాటిల్లకుండా యూజీసీ నూతన నిబంధనలు రూపొందించాలని కేటీఆర్ కోరారు. కేంద్రమంత్రులను కలిసిన బీఆర్ఎస్ బృందంలో ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సంజయ్ కుమార్ తదితరులున్నారు.
రాష్ట్రంలో పడకేసిన పాలన
రాష్ట్ర సచివాలయంలోనే కాక గ్రామ సచివాలయాల్లో కూడా పాలన పడకేసిందని, ప్రజల కష్టాలు తీరేదెలాగంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన పల్లె ప్రజలకు కష్టాలు తెచ్చిందన్నారు. సీఎం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని, గ్రామాల్లో సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అన్నా క్యాంటీన్లో అమ్మ రాజశేఖర్ సందడి..
అంబటి ట్వీట్కు బుద్దా వెంకన్న కౌంటర్
అంబటి ట్వీట్కు బుద్దా వెంకన్న కౌంటర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News