KTR in Trade Unions Meeting: సోనియా ఢిల్లీలో వ్యతిరేకించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది?
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:37 PM
రాష్ట్రంలో కొత్త లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఇండిగో వల్ల జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకూ విస్తరిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. లేబర్ కోడ్లు రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాాద్: తెలంగాణ భవన్లో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత కుబేరులు భారతదేశంలో ఉన్నారని, అలాగే అత్యంత పేదరికం కూడా ఉందని అన్నారు. 'ప్రపంచమే కుగ్రామం' అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదని హెచ్చరించారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లలో భాగంగా కొత్త సంస్కరణలు తెస్తున్నారని, అయితే.. సామాజిక స్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఏ చట్టాలు తెచ్చినా వాటిపై తిరగబడాల్సిందేనని కేటీఆర్ కామెంట్స్ చేశారు. దేశంలో 92శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు.
పదేళ్లలో రూ. 3500 కోట్లు
సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకునేందుకు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.3,500 కోట్ల మేర బతుకమ్మ చీరల తయారీకి కేసీఆర్ ఆర్డర్ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, కొందరు పిచ్చోళ్లు తెలియక ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ చలించిపోయి పార్టీ తరఫున ఆర్థిక సాయం చేశారన్నారు. కనీసం పాలకుల్లో చలనమైనా వస్తుందని కేసీఆర్ ఈ సాయం చేశారని చెప్పుకొచ్చారు.
నాలుగు దశాబ్దాల క్రితం చైనా జీడీపీ మనకన్నా తక్కువగా ఉండేదని, ఇప్పుడు మనది నాలుగు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అయితే, చైనాది అరవై ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థని కేటీఆర్ తెలిపారు. చైనా ఎప్పటికప్పుడు ప్రజలకు అనుగుణంగా నూతన విధానాలు తీసుకురాబట్టే ఫలితాలు సాధించిందన్నారు. అన్నింటికీ ముందు.. పోరాడే పార్టీకి పార్లమెంట్లో తగిన సీట్లు ఇవ్వడమే కారణమన్నారు.
ఏకాధిపత్యం వల్ల అనర్థం
లోక్సభలో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఇలాంటి చట్టాలను తెస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోనోపోలీ (ఏకాధిపత్యం) వల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందోనన్నారు. ఇండిగో విమానయాన సంస్థ వల్ల ప్రయాణికులకు ఐదు రోజులుగా జరిగిన అసౌకర్యం ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఐదు రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం.. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలు కొంతమంది చేతుల్లో పెట్టడం వల్ల ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయని అన్నారు. శ్రమదోపిడీ వల్లే ఇదంతా జరిగిందని మండిపడ్డారు. ఇండిగో ఒత్తిడికి కేంద్రమే తలొగ్గింది తప్ప, ఇండిగో తగ్గలేదన్నారు.
ఎలా అమలు చేస్తుంది?
కేంద్రం ఐదు రోజుల తర్వాత స్పందించడం వల్ల ఎయిర్ పోర్టులు బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లుగా మారాయన్నారు. కొత్త లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఇండిగో వల్ల జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకు విస్తరిస్తుందని, ఇప్పుడు ఏ ఎన్నికలు లేవని, బీఆర్టీయూ ఎవరితోనైనా పని చేయొచ్చని వివరించారు. లేబర్ కోడ్లు రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకుంటే దేశానికి దిక్సూచి అవుతుందన్నారు. సోనియా ఢిల్లీలో వ్యతిరేకించిన బిల్లును, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది? అని ప్రశ్నించారు. ఢిల్లీలో కేంద్ర కార్మిక మంత్రిని, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యులను కలుద్దామని, లేబర్ కోడ్ల అమలు ఆపేదాకా అసెంబ్లీ, మండలి సమావేశాలు స్తంభింపజేస్తామని పిలుపునిచ్చారు. వరంగల్లో తదుపరి రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read:
ఇండిగోకు దెబ్బ మీద దెబ్బ.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ తొలగింపు?..
డయాబెటిస్ వారికి ఈ మొక్క దివ్వ ఔషధం.!
For More Latest News