Share News

Harish Rao on Union Budget: దేశమంటే కొన్ని రాష్ట్రాలేనా.. బడ్జెట్‌పై హరీష్‌ విమర్శలు

ABN , Publish Date - Feb 01 , 2025 | 03:05 PM

Harish Rao: ‘‘2024 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు.. 2026 యూపీ బడ్జెట్, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా? యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు? బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? అంటూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీష్‌రావు.

Harish Rao on Union Budget: దేశమంటే కొన్ని రాష్ట్రాలేనా.. బడ్జెట్‌పై హరీష్‌ విమర్శలు
Former Minister Harish Rao

హైదరాబాద్, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక శాఖ మాజీమంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Govt) పదే పదే వల్లెవేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా అని పునర్ సమీక్షించుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదని తెలిపారు. దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్.. దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం బాధాకరమని మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి ఇదే దోరణిని ప్రదర్శిస్తూ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.


తెలంగాణకు చోటు లేదా..

‘‘2024 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు.. 2026 యూపీ బడ్జెట్, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా? యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు? బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? ఇది కేంద్ర బడ్జెట్‌లా లేదు, కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్‌లాగా ఉంది. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు? తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించింది’’ అంటూ విమర్శలు గుప్పించారు.


మరోసారి మోసపోయాం..

కేంద్ర జీడీపీకి 5.1శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ మరోసారి మోసపోయిందన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణకు నిధులు రాబట్టుకోవడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తీరిగ్గా తేరుకొని, బడ్జెట్‌కు పది రోజుల ముందు 40 వేల కోట్లు కావాలని తూతూ మంత్రంగా లేఖ రాయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు. కేంద్రం బడ్జెట్ ద్వారా నిధులు రాబట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలంలో 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారని.. ఏం సాధించారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


తెలంగాణకు అన్యాయం..

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. నిధుల కేటాయింపు సంగతి దేవుడెరుగు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేకపోయిందని అన్నారు. సంకీర్ణ యుగంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్థానిక పార్టీల మద్ధతు కీలకం అయ్యే రోజొకటి వస్తుందని కేసీఆర్ ఎప్పుడూ చెప్పేవారని తెలిపారు. కేంద్రానికి మద్ధతు పలికిన జనతాదళ్ (యూ) బీహార్‌లో వివిధ అభివృద్ధి పనులకు గతేడాది రూ. 26,000 కోట్ల సాయం, 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, గయాలో పారిశ్రామిక కారిడార్, నూతన విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలకు సాయం తదితరాలు పొందిందని తెలిపారు.


ఎంపీలు ఏం చేస్తున్నారు..

ఎన్నికలు దగ్గర ఉన్నాయని ఇప్పటి బడ్జెట్‌లో బిహార్ కు మరిన్ని వరాల జల్లు కురిపించారన్నారు. బిహార్‌లో మఖాన బోర్డు ఏర్పాటు, మిథిలాంచల్‌లో వెస్టర్న్ కోసి కెనాల్, ఐఐటీ పాట్నా విస్తరణ, బిహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఫడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. కానీ, నమ్మి 16 సీట్లలో కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి ఇచ్చారంటూ విరుచుకుపడ్డారు. 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్రానికి ప్రత్యేకంగా 8 రూపాయలు కూడా అధికంగా సాధించిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు చేయడం సంతోషమని.. ఇందులో తమకు ఎలాంటి బాధ లేదన్నారు. కానీ తెలంగాణ పరిస్థితి ఏమిటో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చెప్పాలన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల సంగతి ఏమిటి? పునర్విభజన చట్టం హామీల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించాల్సిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం దాల్చారని... కేంద్రం మెప్పు కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ పార్టీయేనని మరోసారి రుజువైందన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వైఫల్యం చెందుతున్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పండుగ లాంటి వార్త.. 12 లక్షల వరకు నో ట్యాక్స్

కొత్త పన్నులు.. నెలకు మిగిలేది ఎంతంటే..

Read Latest Telangna News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 03:15 PM