CM Revanth: క్లాస్ లుక్ ఉన్న మాస్ లీడర్ గోపినాథ్.. ఆయన మరణం తీరని లోటు: సీఎం రేవంత్
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:09 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. చూడటానికి క్లాస్గా కనిపించే ఆయన మాస్ లీడర్ అని.. నాకు మంచి మిత్రుడని గుర్తుచేసుకున్నారు.
CM Revanth Tributes To Maganti Gopinath: తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజున ఆయన గోపీనాథ్ గారి సేవలను స్మరించుకుంటూ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. గోపీనాథ్ తనకు చిన్ననాటి నుంచే మిత్రుడని పేర్కొన్నారు. ఆయన మృతి తనను వ్యక్తిగతంగా తీవ్రంగా కలిచివేసిందని గోపీనాథ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం రేవంత్ మాగంటి గోపీనాథ్ జీవన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా పార్టీలు వేరైనా.. వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడని తెలిపారు. ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారని అన్నారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని.. 1985 నుండి 1992 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా సేవలందించారని తెలిపారు.1987-88 లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా 1988-93 లో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా విశేష కృషి చేశారు.
గోపీ ఎన్టీఆర్కు గొప్ప భక్తుడు. సినీరంగంలోనూ నిర్మాతగా రాణించారు. సినిమా రంగంపై అభిమానంతో ‘పాతబస్తీ’(1995), ‘రవన్న’(2000), ‘భద్రాద్రి రాముడు’ (2004), ‘నా స్టైలే వేరు’ (2009) వంటి నాలుగు సినిమాలకు గోపీనాథ్ నిర్మాతగా వ్యవహరించారని స్మరించుకున్నారు. వరసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఘనత సాధించిన వారిలో మాగంటి గోపీనాథ్ ఒకరని అసెంబ్లీలో సీఎం రేవంత్ తెలియజేశారు. చూడటానికి ఆయన క్లాస్ గా కనిపించినా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన మాస్ లీడర్ అని అన్నారు. గోపీనాథ్ అకాల మరణం వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిందని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: