Ind Vs SA: సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు ఉండిపోయింది: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Dec 20 , 2025 | 06:52 AM
సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ను 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించినప్పటికీ.. కెప్టెన్ సూర్య మాత్రం బ్యాటింగ్లో తీవ్రంగా నిరాశపర్చాడు. మ్యాచ్ అనంతరం తన ఫామ్పై స్కై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ సిరీస్(Ind Vs SA)ను టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించినప్పటికీ.. ఒకే ఒక్క లోటు మాత్రం కనిపిస్తోంది. అదే టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్.
కెప్టెన్(Suryakumar Yadav)గా టీమ్కు ఎన్నో అద్భుత విజయాలు అందిస్తున్నప్పటికీ.. బ్యాటర్గా మాత్రం సూర్య పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఆసియా కప్లో ఒక్క పాకిస్తాన్పై రాణించడం తప్ప.. సూర్య ఈ ఏడాది పెద్దగా స్కోరు చేసింది లేదు. బౌలర్లను తన వ్యూహాలతో బెంబేలెత్తించే సూర్య.. ఇప్పుడు ఫామ్ కోల్పోయి క్రీజులోకి వచ్చీ రాగానే పెవిలియన్ చేరుతున్నాడు. తన ఫామ్పై మ్యాచ్ అనంతరం స్కై స్పందించాడు.
‘ఈ సిరీస్లో అందరూ అద్భుతంగా రాణించారు. ఏదైనా మిస్ అవుతున్నామంటే.. అది దూకుడుగా ఆడే బ్యాటర్ సూర్యనే. అతడెక్కడో మిస్ అయ్యాడు. కానీ కచ్చితంగా బలంగా తిరిగి వస్తాడు’ అని తన ఆటతీరు గురించి స్కై ప్రస్తావించాడు.
ఇవీ చదవండి:
రోల్ బాల్ ప్రపంచ కప్ విజేతగా భారత్
మెస్సి కోల్కతా పర్యటన.. కోర్టును ఆశ్రయించిన గంగూలీ!