Congress: కాంగ్రెస్లో కలవరం.. రాజణ్ణపై వేటుతో నేతల్లో భయం.. భయం
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:57 AM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ల చౌర్యంపై పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రంలోని బీజేపీతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రాహుల్గాంధీ తీరుపై మండిపడుతున్నాయి.
- విధానసౌధలో ఇదే హాట్ టాపిక్
- సీఎల్పీలోనూ కీలక విషయాలపై సీనియర్ల మౌనం
బెంగళూరు: కాంగ్రెస్(Congress) పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ల చౌర్యంపై పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రంలోని బీజేపీతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రాహుల్గాంధీ తీరుపై మండిపడుతున్నాయి. ఇలా సాగుతున్న తరుణంలోనే రాష్ట్ర సహకారశాఖ మంత్రి రాజణ్ణ నగరంలోని మహదేవపురలో ఓట్ల చౌర్యం జరిగే సమయానికి ప్రభుత్వం మనదేనని వ్యాఖ్యానించారు. రాజణ్ణ ముక్కుసూటిగా వ్యవహరించేవారని, ఆయన చాలా సందర్భాలలో నోరు జారుతారనేది తెలిసిందే.
ఇదే అవకాశంగా తీసుకుని కొందరు కీలకనేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. రెండు వారాల క్రితం పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ సుర్జేవాలాపైన కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. అన్నింటిని కలిపి రాహుల్గాంధీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని రాహుల్గాంధీ తీవ్రంగ పరిగణించారు. రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పెను ప్రభావం చూపనుందని సీఎం సిద్దరామయ్య తీవ్రమైన కసరత్తు జరిపారు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. రెండేళ్లుగా సీఎంకు అత్యంత ఆప్తుడిగా కొనసాగడం, మరోవైపు శాసనసభ సమావేశాలు ఉండడమే. నేరుగా రాహుల్గాంధీకి ముఖ్యమంత్రి ఫోన్ చేసి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
కానీ ఫోన్లో రాహుల్గాంధీ శాక్ హిమ్... (అతడిని తొలగించు) అంటూ మరో మాట మాట్లాడకుండా ఫోన్కట్ చేసినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి కూడా ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. వాస్తవానికి సోమవారం ఉదయం శాసనసభ సమావేశాలకు వచ్చేందుకు ముందే రాజణ్ణ, సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. పరిస్థితిని వివరించారు. దీంతో రాజణ్ణ కూడా అధిష్టానం మాట వద్దని, మీ నిర్ణయం చెప్పండి అంటూ కోరినట్టు తెలుస్తోంది.

మీరు రాజీనామా చేయమంటే ఒక్కక్షణం కూడా ఆలోచించనని తేల్చిచెప్పినట్టు సమాచారం. అక్క డే ఓ పేపర్లో రాజీనామా లేఖను రాసి పెట్టినట్టు తెలుస్తోంది. రాజీనామా లేఖ తీసుకున్నా రాహుల్గాంధీ ఆదేశాలు పాటించినట్టు ఉండదనే ముఖ్యమంత్రి, గవర్నర్కు లేఖ రాసి వెంటనే కేబినెట్ నుంచి రాజణ్ణను తొలగించాలని సిఫారసు చేశారు. ఆ తర్వాత కాసేపటికే రాజ్భవన్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ప్రక్రియ సాగుతున్న సమయంలో రాజణ్ణ విధానసౌధలోనే ఉన్నారు.
సాయంత్రానికి రాజణ్ణను మరోసారి సీఎం నివాసానికి పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన రాజణ్ణ నాపై ఎవరు ఫిర్యాదులు చేశారో అన్నీ తెలుసునని సమయం వచ్చినప్పుడు చెబుతానని త్వరలోనే ఢిల్లీ వెళ్లి కారణాలు వివరిస్తానన్నారు.
రాజణ్ణకు రాజీనామా చేసే అవకాశం కూడా లేకుండా అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర పార్టీ నేతలలో గుబులు పట్టుకుంది. ఇక అధిష్ఠానానికి వ్యతిరేకంగా నోరు తెరవకూడదని అందరికీ గుణపాఠమైంది. మరోవైపు మంత్రుల్లో మార్పులు జరపాలని భావిస్తున్న అధిష్టానం నిర్ణయం తీసుకున్నా ఎదురు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో శాసనసభ సమావేశాలలో ఎదుర్కోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాజణ్ణ పరిణామంతో ఎవరూ గట్టిగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని సమాచారం.
మొన్న బీజేపీలో.. నేడు కాంగ్రెస్ లో..
బీజేపీలో ఎమ్మెల్యేగా ఉంటూనే సొంతపార్టీ నాయకుల తీరును ఎండగట్టడం, ఎవరినైనా లెక్కచేయకుండా మాట్లాడేలా వ్యవహరించిన బసనగౌడ పాటిల్ యత్నాళ్పై పార్టీ అధిష్టానం కోలుకోలేని దెబ్బతీసింది. ఆయనను ఆరేళ్లపాటు పార్టీనుంచి సస్పెండ్ చేసింది. ఇక కాంగ్రె్సలోనూ రాజణ్ణ అదే తరహాలోనే వ్యవహరించారు. ఎవరి విషయమైనా లెక్కచేయకుండా మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఏకంగా మంత్రి పదవినుంచి తొలగించారు. రాష్ట్రంలో రెండు పార్టీలకు చెందిన ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న ఇద్దరిపై ఢిల్లీ పెద్దలు కోలుకోలేని దెబ్బతీశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్ కోబ్రా
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News