Share News

Pak Denied Entry: సిక్కు కాదంటూ.. 14 మందిని వెనక్కి పంపేసిన పాక్

ABN , Publish Date - Nov 05 , 2025 | 05:00 PM

ఈ పర్యటన కోసం యాత్రికుల బృందం బస్ టిక్కెట్ల ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్కరూ రూ.13,000 చెల్లించారు. అయితే వారికి ప్రవేశం నిరాకరించడంతో ఆ టిక్కెట్ ఫేర్ తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది.

Pak Denied Entry: సిక్కు కాదంటూ.. 14 మందిని వెనక్కి పంపేసిన పాక్
pakistan

అమృత్‌సర్: సిక్కుల గురువు గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా అట్టారి-వాగా సరిహద్దు వద్ద 14 మందికి పైగా యాత్రికులకు ప్రవేశాన్ని పాకిస్థాన్ నిరాకరించింది. యాత్రికుల హిందూ మత విశ్వాసాలను కారణంగా చూపుతూ పాకిస్థాన్ ఇమిగ్రేషన్ అధికారులు వారిని వెనక్కి తిప్పి పంపినట్టు సమాచారం. వీరిలో ఏడుగురు ఢిల్లీవాసులు కాగా, తక్కిన వారు లక్నోకి చెందిన వారు.


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పర్యటన కోసం యాత్రికుల బృందం బస్ టిక్కెట్ల ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్కరూ రూ.13,000 చెల్లించారు. అయితే వారికి ప్రవేశం నిరాకరించినప్పటికీ టిక్కెట్ ఫేర్ తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది.


2,100 మందికి హోం శాఖ క్లియరెన్స్

గురునానక్ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌లో పర్యటించేందుకు 2,100 మందికి కేంద్ర హోం శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. దాదాపు అందరికి ట్రావెల్ డాక్యుమెంట్లను ఇస్లామాబాద్ జారీ చేసింది. మంగళవారంనాడు 1,900 మంది యాత్రికులు విజయవంతంగా వాగా సరిహద్దు ద్వారా పాకిస్థాన్‌లోకి ప్రవేశించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇరుదేశాల మధ్య రాకపోకలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి.


గురుపూరబ్ సెలబ్రేషన్స్ కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన సిక్కు డెలిగేషన్‌కు అకల్ తఖ్త్ తాత్కాలిక జతేదార్ జ్ఞాని కుల్దీప్ సింగ్ గర్గజ్ నాయకత్వం వహించారు. నవంబర్ 4న ఆయన పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టారు. లాహోర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని గురుద్వారా జన్మస్థాన్‌ వద్ద ప్రధాన కార్యక్రమం బుధవారం సాయంత్రం జరుగనుంది. పది రోజుల యాత్రలో భాగంగా భారత సిక్కు యాత్రికులు హసన్ అబ్దల్‌లోని గురుద్వారా పంజా సాహిబ్, ఫరూఖాబాద్‌లోని గురుద్వారా సచ్చా సౌదా, కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించనున్నారు.


కర్తార్‌పూర్ కారిడార్‌ను తిరిగి తెరవండి

కాగా, కర్తార్‌పూర్ కారిడార్‌ను తిరిగి తెరవాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గురుపూరబ్ సందర్భంగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో పూజలు చేసిన అనంతరం సీఎం ఈ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వాళ్లతో క్రికెట్ మ్యాచ్‌లు కూడా జరుగుతున్నాయని, భక్తులు కూడా కర్తార్‌పూర్ సాహిబ్ సందర్శన అనంతరం 4-5 గంటల్లోనే తిరిగి వస్తారని, ఆ దృష్ట్యా కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరిచేందుకు హోం శాఖ, విదేశాంగ శాఖ చొరవ తీసుకోవాలని కోరారు.


ఇవి కూడా చదవండి..

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 25 లక్షల దొంగ ఓట్లంటూ..

ఎస్ఐఆర్‌ను మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా.. రాహుల్ ఆరోపణలపై ఈసీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 05 , 2025 | 06:19 PM