Amit Shah On SIR Debate: ఎస్ఐఆర్పై విపక్షాలవన్నీ అబద్ధాలే.. మండిపడిన అమిత్షా
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:52 PM
పార్లమెంటులో చర్చ ఎన్నికల సంస్కరణలకు ఉద్దేశించినప్పటికీ విపక్షాలు కేవలం ఎస్ఐఆర్పైనే దృష్టిసారించాయని, గత నాలుగు నెలలుగా ఎస్ఐఆర్పై అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని అమిత్షా అన్నారు.
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై రాహుల్ గాంధీతో సహా విపక్షలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit Shahg) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. నెలల తరబడి ఎస్ఐఆర్పై అబద్ధాల వ్యాప్తి చేస్తున్నారని, అందర్నీ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో బుధవారంనాడు జరుగుతున్న చర్చలో అమిత్షా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ చేస్తున్న 'ఓట్ చోరీ' ఆరోపణలు కూడా ఎస్ఐఆర్ను తప్పుదారి పట్టించేవేనని చెప్పారు.
ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ
ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసే సంస్థ కాదని అమిత్షా స్పష్టం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరపాల్సిన బాధ్యత ఈసీదేనని చెప్పారు. పార్లమెంటులో చర్చ ఎన్నికల సంస్కరణలకు ఉద్దేశించినప్పటికీ విపక్షాలు కేవలం ఎస్ఐఆర్పైనే దృష్టిసారించాయని, గత నాలుగు నెలలుగా ఎస్ఐఆర్పై అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని అన్నారు. మాజీ ప్రధాని దివంగత జవహర్ లాల్ నెహ్రూ హయాంలో 1952లో తొలి ఎస్ఐఆర్ జరిగిందని, ఆ తర్వాత కూడా నెహ్రూ, ఇందిరాగాంధీ సహా కాంగ్రెస్ పాలనలో పలుమార్లు ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించారని చెప్పారు. రాజ్యాంగ బాధ్యతలకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ నిర్వహిస్తోందని వివరించారు.
ఇవి కూడా చదవండి..
శశిథరూర్కు వీరసావర్కర్ అవార్డు... తీసుకోవడం
జర్మనీ పర్యటనకు రాహుల్.. లీడర్ ఆఫ్ పార్టీయింగ్ అంటూ బీజేపీ విమర్శ, ప్రియాంక కౌంటర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి