PM Modi Safari : చేతిలో కెమెరా.. ముందు సింహం.. ప్రధాని మోదీ సఫారీ..
ABN , Publish Date - Mar 03 , 2025 | 03:38 PM
PM Modi Ghir Safari : ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చేతిలో కెమెరా.. తలపై టోపీ ధరించిన మోదీ జంగిల్ సఫారీని ఆస్వాదించారు.
PM Modi Ghir Safari : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ జునాగఢ్ జిల్లాలోని గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీని ఆస్వాదించారు. ఆదివారం రాత్రి గిర్ జాతీయ ఉద్యానవనంలో ఉన్న రాష్ట్ర అటవీ శాఖ అతిథి గృహం సింగ్ సదన్కు ప్రధాని మోదీ చేరుకున్నారు. రాత్రి విశ్రాంతి తర్వాత సోమవారం ఉదయం జంగిల్ సఫారీకి వెళ్ళారు. ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.
మోదీకి ఎదురొచ్చిన సింహాలు..
ప్రధాని మోదీ సఫారీలో వెళ్తుండగా నేషనల్ పార్క్లో సింహాలు సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ కనిపించాయి. ఆ దృశ్యాలను తన చేతిలోని కెమెరాలో బంధింస్తూ ముందుకు సాగారు. మధ్యలో ఒకచోట జీపు ఆపించి ప్రధానమంత్రి పలాష్ పువ్వులు కోశారు. వసంతకాలంలో మాత్రమే ఈ పువ్వులు విరబూస్తాయి. ఈ విశేషాలను చెప్తూ వన్యప్రాణులను సంరక్షించి, వాటి వైవిధ్యాన్ని కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జాతి భవిష్యత్తు మీ చేతుల్లోనే..
ఈ భూమిపై జీవవైవిధ్యం, వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 'ఈ రోజు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా, ఈ భూమి అద్భుతమైన జీవవైవిధ్యాన్ని కాపాడటానికి మన అంకితభావాన్ని ప్రకటిద్దాం' అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యులు అవ్వాల్సిన అవసరం ప్రధాని పేర్కొన్నారు. ఈ జాతుల భవిష్యత్తును రక్షించండి. వన్యప్రాణులను కాపాడటంలో భారతదేశం చేస్తున్న కృషిని చూసి గర్విస్తున్నట్లు తెలిపారు.
ప్రాజెక్ట్ లయన్ కోసం.. రూ.2900 కోట్లు..
గిర్ జాతీయ ఉద్యానవనంలో ఆసియా సింహాలకు సంబంధించిన ప్రాజెక్ట్ లయన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2900 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధి ద్వారా ఆసియా సింహాల సంరక్షణ పనులు జరుగుతాయి. ప్రస్తుతం ఆసియా సింహాలు కేవలం గుజరాత్లోనే ఉన్నాయి. ఇవి 9 జిల్లాల్లోని 53 తాలూకాల్లో దాదాపు 30 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్నాయి. జునాగఢ్ జిల్లాలోని న్యూ పిపాలియాలో వన్యప్రాణుల కోసం 'జాతీయ రిఫెరల్ సెంటర్' కూడా నిర్మిస్తున్నారు. అలాగే, వన్యప్రాణులను ట్రాక్ చేయడానికి గిర్ నేషనల్ పార్క్లో ఒక పర్యవేక్షణ కేంద్రం, ఆసుపత్రిని నిర్మించారు.
లయన్ సఫారీ ఆస్వాదించాక జాతీయ వన్యప్రాణి బోర్డు (NBWL) ఏడవ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. జాతీయ వన్యప్రాణి బోర్డులో CDS, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, NGO ప్రతినిధులు, వన్యప్రాణి అధికారులు, రాష్ట్ర కార్యదర్శులు సహా 47 మంది సభ్యులు ఉన్నారు. సమావేశం తర్వాత, ప్రధాని మోదీ గిర్ జాతీయ ఉద్యానవన మహిళా ఉద్యోగులతో కూడా సమావేశమయ్యారు.
Read Also : New Passport Rules: రూల్స్ మారాయి.. ఈ సర్టిఫికేట్ లేకుంటే.. వీరికి నో పాస్ పోర్ట్..
UNESCO Report: చదువు.. అర్థమయ్యే భాషలో ఉండట్లేదు
Ganga River Pollution: స్నానానికి పనికిరాని గంగ నీరు!