Rahul Gandhi On EC: ఈసీపై త్వరలో పెద్ద బాంబు పేలుస్తా..
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:54 PM
ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖాన్ని చూపించలేరని విమర్శించారు.
బిహార్: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి భారత ఎన్నికల సంఘంసై విమర్శలు గుప్పించారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా బిహార్లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఓటు చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర ఇవాళ(సోమవారం) చివరి రోజుకి చేరింది. ఆగస్టు 17న ప్రారంభమైన ఈ యాత్ర ఇవాళ్టి(సెప్టెంబర్ 1న)తో ముగియనుంది. ఓటర్ల జాబితాలో ఈసీ అవకతవకలకు పాల్పడిందని, బీజేపీ అప్రజాస్వామికంగా ఓటు చోరీ చేసిందని ఆరోపిస్తూ.. రాహుల్గాంధీ ఈ యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. యాత్ర చివరి రోజు కావడంతో తేజస్వియాదవ్, కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ, సమాజ్వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్, సీపీఐ నేత దీపాంకర్ భట్టాచార్య, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖాన్ని చూపించలేరని విమర్శించారు. బీజేపీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా.. ప్రవర్తించిందని ఆరోపించారు. ఎవరు ఏ తప్పు చేసిన ఎప్పుడో ఒక సమయంలో దొరికిపోతారని.. ఇప్పుడు ఆ సమయం బీజేపీకి వచ్చిందని స్పష్టం చేశారు. ఓట్ల చోరీలో వాస్తవాలను ప్రజలు తెలుసుకోబోతున్నారని తెలిపారు. కాగా.. ఈ యాత్ర బీహార్లో 25 జిల్లాల వ్యాప్తంగా.. 110 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. 1300 కిలోమీటర్ల మేర సాగింది.
అయితే గతంలో.. కూడా ఈసీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశం మొత్తం దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని, అనేక రాష్ట్రాల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చెప్పారు. ఈ క్రమంలో బిహార్ ఓటర్ల జాబితా సవరణపై విరుచుకుపడ్డారు. వేలల్లో నకిలీ ఓటర్లు ఉన్నారని, ఒకే ఇంటిలో 80 మంది ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. దీనిపై మీడియా సమావేశంలో ప్రజంటేషన్ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత.. ఈసీపై పలు ఆరోపణలు గుప్పించారు. ఈసీ అక్రమాలకు పాల్పడిందన పేర్కొంటూ పలు ఆధారాలను బయటపెట్టారు. ఇటీవల పలు రాష్ట్రాలు అసెంబ్లీ, గతేడాది లోక్సభ ఎన్నికల్లోనూ అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలపై తాము పరిశోధన చేశామని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. టీజీఎస్పీడీసీఎల్ కొత్త నిబంధనలు
తెలంగాణ శాసనమండలిలో బీసీ బిల్లుకు ఆమోదం