Akash Missile: భారత్- పాక్ యుద్ధం.. ఆ మిసైల్ సృష్టికర్త ఆయనే..
ABN , Publish Date - May 09 , 2025 | 08:59 PM
Akash Missile: భారత్, పాకిస్థాన్ల నడుమ ఉద్రిక్త వాతావరణంలో ఆకాశ్ క్షిపణులు అత్యంత కీలకంగా వ్యవహరించాయి. ఇవి హైదరాబాద్లోనే తయారైన విషయం తెలుసా. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ సైతం తెలుగు వారేననే విషయం తెలుసా..

న్యూఢిల్లీ, మే 09: భారత్లోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ దాడులను భారత్ సైన్యం తిప్పికొట్టింది. అందుకు భారత సైన్యం అంబులపొదిలోని ఆకాశ్ క్షిపణులు అత్యంత కీలకంగా వ్యవహరించాయి. ఈ ఆకాశ్ క్షిపణుల తయారీలో తెలుగు వ్యక్తి కీలకంగా వ్యవహరించారు. ఆయనే డాక్టర్ ప్రహ్లాద రామారావు. ఆయన వయస్సు 78 ఏళ్లు.
గతంలో డీఆర్డీవో శాస్త్రవేత్తగా విధులు నిర్వహించిన ఆయన రిటైరై.. ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతోన్నారు. పాక్ ప్రయోగించిన క్షిపణులతోపాటు డ్రోన్లను అడ్డుకోవడంలో ఆకాశ్ ప్రభావతంగా పని చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది తన జీవితంలో సంతోషకరమైన రోజని పేర్కొన్నారు. శత్రుదేశం ప్రయోగించిన వైమానిక లక్ష్యాలను తన బిడ్డ(ఆకాశ్ మిసైల్) తిప్పికొట్టడంలో అత్యంత ప్రతిభ కనబరిచిందని అన్నారు.
ఇది తన అంచనాలకు సైతం మించి పని చేసిందని చెప్పుకొచ్చారు రామారావు. భవిష్యత్తులో సైతం నిర్దేశిత లక్ష్యాలను ఆకాశ్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఆకాశ్ క్షిపణి తయారీ కోసం ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారని.. దీనికి డైరెక్టర్గా తనను భారతరత్న, భారత మాజీ ఉప రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఎంపిక చేసుకున్నారని డాక్టర్ ప్రహ్లాద రామారావు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిని తానేనని గత జ్జాపకాలను ఆయన నెమరేసుకున్నారు.
డ్రోన్లు, క్షిపణులు, హెలికాప్టర్లతోపాటు యూఎస్కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాలను సైతం ఆకాశ్ క్షిపణి సమర్థవంతంగా అడ్డుకొంటుందని ఆయన తెలిపారు. కానీ ఈ క్షిపణులను రూపొందించిన అనంతరం వీటిని కోనుగోలు చేసేందుకు భారత్ సైన్యం వెనకడుగు వేసిందని తెలిపారు. భారత్ ప్రస్తుతం తన ఆకాశాన్ని రక్షించుకోవడమే కాదు.. శత్ర దేశాలకు చెందిన లక్ష్యాలను నియంత్రిస్తుందని రామారావు పేర్కొన్నారు.
ఈ ఆకాశ్ క్షిపణులను హైదరాబాద్లోని భారత్ డైనమిక్ లిమిటెడ్లో రూపొందించినట్లు డాక్టర్ ప్రహాద రామారావు గుర్తు చేసుకున్నారు. ఇది స్వల్ప శ్రేణి అని.. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగిస్తారని వివరించారు. అలాగే ఇది వైమానిక ముప్పు నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు. ఇది ఒకే సారి బహుళ లక్ష్యాలను ఛేదిస్తోందని తెలిపారు.
ఈ ఆకాశ్.. 20 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను సైతం ఛేదించగలదని చెప్పారు. ప్రతి లాంచర్లో మూడు క్షిపణులు ఉంటాయన్నారు. అవి ఫైర్ అండ్ ఫర్గాట్ మోడ్లో పని చేస్తాయని తెలిపారు. ఒక్కొక్కటి 20 అడుగుల పొడవు, 710 కిలోల బరువు ఉంటుందని వివరించారు. ఇది ఆటోమెటిక్, రియల్ టైమ్, మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్ సామార్థ్యాన్ని కలిగి ఉందని ఆకాశ్ క్షిపణి గురించి డాక్టర్ ప్రహాద రామారావు సోదాహరణగా వివరించారు.
Also Read:
Operation Sindoor: ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతులు భేటీ
Operation Sindoor: సైబర్ దాడి.. బిగ్ అలర్ట్
పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేశాం
Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..
Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..
Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం
For National News And Telugu News