Balochistan Freedom Fighters: పాకిస్తాన్పై దాడులు.. ఆపై జెండాలు ఎగరవేసిన బెలూచిస్తాన్ వేర్పాటువాదులు..
ABN , Publish Date - May 09 , 2025 | 08:22 PM
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉండగా, పాకిస్తాన్లో అంతర్గత సంఘర్షణ తీవ్రమవుతోంది. ఇదే సమయంలో బలూచ్ యోధులు పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులు చేసి పలు ప్రాంతాల్లో జెండాలను ఊపుతున్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాకిస్తాన్ ఒకవైపు భారత్పై డ్రోన్, మిసైల్ దాడులతో గందరగోళంలో ఉంటే, మరోవైపు బలూచిస్తాన్లో తిరుగుబాటుదారులు పాక్ సైన్యంపై దాడులను ముమ్మరం చేశారు. బలూచ్ యోధులు మూడు సమూహాలుగా విడిపోయి, పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతమైన బలూచిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాలు బలూచ్ తిరుగుబాటు గ్రూపులు, పాక్ సైన్యం మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్న సమయంలో జరిగాయి. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పాకిస్తాన్ జెండాలను తొలగించి, బలూచ్ జెండాలను ఎగురవేస్తున్న వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
బలూచ్ స్వాతంత్ర్య గ్రూపులు గురువారం పాక్ సైన్యం, వారి ఆస్తులపై బలూచిస్తాన్లో ఒక్కసారిగా దాడులు చేశాయి. పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత వారం రోజులుగా ఈ దాడులు వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ దాడులు చేస్తుండగా, ఇదే సమయంలో ఇస్లామాబాద్-రావల్పిండి ప్రాంతాల్లో బలూచ్ గ్రూపులు తమ దాడులను మరింత తీవ్రతరం చేశాయి.
బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో గురువారం పాక్ భద్రతా దళాలు దాదాపు నాలుగు దాడులను ఎదుర్కొన్నాయి. ఈ దాడులను "గుర్తుతెలియని సాయుధ దుండగులు" చేసినట్లు బలూచిస్తాన్కు చెందిన రేడియో జ్రుంబేష్ తెలిపింది. క్వెట్టా నగరంలో పేలుళ్లు, తీవ్రమైన కాల్పుల శబ్దాలు వినిపించాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) తిరుగుబాటుదారులు కేచ్, మస్తుంగ్, కచ్చి ప్రాంతాల్లో పాక్ సైన్యం, వారి సహకారులపై ఆరు వేర్వేరు దాడులు చేశారని రేడియో జ్రుంబేష్ వెల్లడించింది.
ఆ క్రమంలో బలూచ్ ప్రజలు తమ జెండాలను ఎగురవేస్తూ, పాకిస్తాన్ జెండాలను తొలగించారు. ప్రపంచ దేశాలు పాకిస్తాన్లోని తమ రాయబార కార్యాలయాలను మూసివేసి, కొత్తగా ఉద్భవిస్తున్న బలూచిస్తాన్ దేశంలోకి మార్చాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పాకిస్తాన్కు వీడ్కోలు, బలూచిస్తాన్కు స్వాగతం అని బలూచ్ రచయిత మీర్ యార్ బలోచ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ దాడులు కొద్ది రోజుల ముందు, పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసీ, బలూచిస్తాన్లో పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం, సైన్యం నియంత్రణ కోల్పోతున్నాయని, రాత్రి సమయంలో కూడా పరిస్థితి అదుపులో లేదని అన్నారు.
బలూచ్ రచయిత మీర్ యార్ బలోచ్, డేరా బుగ్టిలోని పాకిస్తాన్ గ్యాస్ ఫీల్డ్స్పై తిరుగుబాటుదారులు దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ నిర్వహించే 100కు పైగా గ్యాస్ బావులు ఉన్నాయి. "పాకిస్తాన్ పతనం సమీపిస్తోందని, ఇక్కడ మేము మా స్వాతంత్రాన్ని ప్రకటించినట్లు చెప్పారు. భారత్లో బలూచిస్తాన్ అధికారిక కార్యాలయం, రాయబార కార్యాలయాన్ని అనుమతించాలని మేము కోరుతున్నామని మీర్3 యార్ బలోచ్ ఎక్స్లో రాశారు.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి