Share News

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - May 09 , 2025 | 04:29 PM

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ సహా పలు ప్రాంతాల ప్రజలు ఢిల్లీకి చేరుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను సిద్ధం చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
India Pakistan Tension Special Trains

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి (India Pakistan Tension) క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో జమ్మూ ప్రాంతంలోని ప్రజల భద్రత కోసం భారత రైల్వే శాఖ అత్యవసర చర్యలు చేపట్టింది. జమ్మూ విమానాశ్రయం మూసివేయడం, సరిహద్దు జిల్లాల్లో యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో, జమ్మూ, ఉధమ్‌పూర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం (మే 9, 2025) తెల్లవారుజామున జమ్మూ నగరంలో వినిపించిన బాంబు శబ్దాలు స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించాయి. ఈ ఘటనలు సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం చేపట్టిన దాడులను భారత సైన్యం విఫలం ( Operation Sindoor ) చేసిన కొద్ది గంటల్లోనే చోటుచేసుకున్నాయి.


జమ్మూలో భయానక వాతావరణం

శుక్రవారం తెల్లవారుజామున 3:50 నుంచి 4:45 గంటల మధ్య జమ్మూ నగరంలో దాడుల శబ్దాలు వినిపించాయి. ఈ శబ్దాలతో పాటు సైరన్లు మోగడంతో నగరంలో ఒక్కసారిగా భయాందోళన వ్యాపించింది. ఈ ఘటనలు జరిగిన వెంటనే నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో అక్కడి స్థానికుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో ఆకాశంలో కదులుతున్న వస్తువులు, వాటిని నిర్వీర్యం చేస్తున్నప్పుడు జరిగిన పేలుళ్ల దృశ్యాలు కనిపించాయి. భారత భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగి ఈ బెదిరింపులను తిప్పికొట్టాయి. ఈ ఘటనకు ముందు రాత్రి వేళల్లో పాకిస్తాన్ సైన్యం పూంచ్, రాజౌరి, జమ్మూ జిల్లాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి. భారత సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో భారత సైన్యం దీటుగా స్పందించి, పాక్ దాడులను తిప్పికొట్టింది.


శాంతియుతంగా ఉండాలని

జమ్మూ డిప్యూటీ కమిషనర్ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ఒక పోస్ట్ చేసి ప్రజలను శాంతియుతంగా ఉండాలని, భయపడవద్దని కోరారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు బంద్ ప్రకటించారు. జమ్మూ విమానాశ్రయం మూసివేయబడడంతో, అక్కడి ప్రజలు ఢిల్లీ చేరుకునేదుకు ప్రత్యామ్నాయ మార్గంగా రైల్వే శాఖ మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు జమ్మూ, ఉధమ్‌పూర్ నుంచి ఢిల్లీకి ప్రయాణికులను సురక్షితంగా తీసుకెళ్తాయి.

రైలు సంఖ్య 04612: ఈ రైలు జమ్మూ నుంచి ఉదయం 10:45 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలులో 12 రిజర్వ్‌డ్ కోచ్‌లు, 12 అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ రైలు సాధారణ సీటింగ్ ఏర్పాట్లతో రూపొందించబడింది.

వందే భారత్ ప్రత్యేక రైలు: 20 కోచ్‌లతో కూడిన ఈ రైలు ఉధమ్‌పూర్ నుంచి జమ్మూ, పఠాన్‌కోట్ మీదుగా ఢిల్లీకి బయలుదేరుతుంది. ఈ రైలు మధ్యాహ్నం 12:45 గంటలకు బయలుదేరనుంది. వందే భారత్ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

22 LHB ప్రత్యేక రైలు: ఈ రైలు జమ్మూ నుంచి రాత్రి 7:00 గంటలకు బయలుదేరుతుంది. 22 లింకే హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్‌లతో రూపొందించబడిన ఈ రైలు పూర్తిగా రిజర్వ్‌డ్ సీట్లతో ఉంటుంది. ఈ రైలు ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యంతో, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది.


ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం

ఈ ప్రత్యేక రైళ్ల ఏర్పాటు ద్వారా రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. జమ్మూ, ఉధమ్‌పూర్ ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రయాణికులు, విద్యార్థులు, పర్యాటకులు ఈ రైళ్ల ద్వారా సురక్షితంగా ఢిల్లీ చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో అదనపు భద్రతా బలగాలను మోహరించడంతో పాటు, ప్రయాణికుల సౌకర్యం కోసం తాగునీరు, ఆహార సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని రైల్వే శాఖ తెలిపింది.


ఇవి కూడా చదవండి

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

Operation Sindoor: దూకుడు పెంచిన పాక్.. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 09 , 2025 | 05:37 PM