Tejashwi Yadav: హెలికాప్టర్ నుంచి బాటిల్ విసిరేసిన తేజస్వి.. విమర్శల వెల్లువ
ABN , Publish Date - Oct 29 , 2025 | 06:47 PM
తేజస్వి యాదవ్ చర్యపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. నేతలే పరిశుభ్రతను పట్టించుకోకుంటే పర్యావరణం పట్ల పౌరులు జాగ్రత్తలు తీసుకుంటారని ఎలా అనుకోగలం? అని ఒక నెటిజన్ ప్రశ్నించారు.
పాట్నా: ప్రజాజీవితంలో ఉన్న నేతల ప్రతి చిన్న కదలికను ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు. ఏమాత్రం అభ్యంతరకరంగా తోచినా విమర్శలు గుప్పించేందుకు వెనుకాడరు. తాజాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష 'మహాగట్బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav)కు చెందిన ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇంత బాధ్యత లేకపోతే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
విషయానికి వస్తే.. డోర్ తెరిచి ఉన్న హెలికాప్టర్లో తేజస్వి యాదవ్ కూర్చుని ఉండటం ఆ వీడియోలో కనిపిస్తోంది. ప్లాస్టిక్ బాటిల్తో ఆయన చేతులు కడుక్కుంటూ ఖాళీ బాటిల్ను హెలిపాడ్పైకి విసిరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ కావడంతో ఒక్కసారిగా అది వైరల్ అయింది.
తేజస్వి చర్యపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. నేతలే పరిశుభ్రతను పట్టించుకోకుంటే పర్యావరణం పట్ల పౌరులు జాగ్రత్తలు తీసుకుంటారని ఎలా అనుకోగలం? అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. 'చేతులు కడుక్కుంటే మీ ఇమేజ్ క్లీన్ కాదు, ముందు మీ మైండ్సెట్ శుభ్రం చేసుకోండి' అని మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నూతన బీహార్ను ఆవిష్కరిస్తామంటూ 'మహాగట్బంధన్' మేనిఫెస్టోను తేజస్వి యాదవ్ మంగళవారంనాడు ఆవిష్కరించారు. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్విని ఇప్పటికే ప్రకటించారు. కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 6,11 తేదీల్లో జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
సొంత కారు లేకుంటే పిల్లను ఇవ్వరన్న డీకే.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ
భారత్ - చైనా చర్చలు.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి