Bihar Elections: సీట్ల షేరింగ్ వివాదంపై గెహ్లాట్ మధ్యవర్తిత్వం.. లాలూతో భేటీ..
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:02 PM
లాలూతో సమావేశానంతరం గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ, బిహార్లో 243 సీట్లు ఉన్నాయని, 5 నుంచి 10 సీట్లలో స్నేహపూర్వక పోటీ పెద్ద విషయం కాదని అన్నారు. 'ఇండియా' కూటమి పూర్తి ఐక్యమత్యం, పూర్తి శక్తిసామర్థ్యాలతో పోటీకి సిద్ధంగా ఉందన్నారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాల వ్యవధి మాత్రమే ఉండటం, విపక్ష మహాఘట్బందన్ (INDI Alliance)లో సీట్ల పంపకాలపై వివాదం నెలకొనడంతో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) భాగస్వామ్య పార్టీల మధ్య సయోధ్య యత్నాలు మొదలుపెట్టారు. బుధవారం నాడు పాట్నా చేరుకున్న గెహ్లాట్ నేరుగా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్తో భేటీ అ్యయారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్క రోజే గడువు ఉండటం, 12 సీట్లలో ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర భాగస్వామ్య పార్టీలు నామినేషన్లు దాఖలు చేయడంతో పొత్తుల వ్యవహారం గందరగోళంలో పడింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేతలతో గెహ్లాట్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
లాలూతో సమావేశానంతరం గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ, బిహార్లో 243 సీట్లు ఉన్నాయని, 5 నుంచి 10 సీట్లలో స్నేహపూర్వక పోటీ పెద్ద విషయం కాదని అన్నారు. 'ఇండియా' కూటమి పూర్తి ఐక్యమత్యం, పూర్తి శక్తిసామర్థ్యాలతో పోటీకి సిద్ధంగా ఉందన్నారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని చెప్పారు.
తేజస్వీ సీఎం అభ్యర్థిత్వంపై..
తేజస్వితో సమావేశమైన అనంతరం గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ, మహారాష్ట్రలో చేదు అనుభవం తరువాత విపక్ష కూటమికి బిహార్లో గెలుపు చాలా కీలకమని, సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటామని చెప్పారు. తేజస్వి సీఎం అభ్యర్థిత్వాన్ని ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? అని మీడియా అడిగినప్పుడు 'అలాంటి ప్రకటన నా నుంచి ఎందుకు కోరుకుంటున్నారు?' అని ప్రశ్నించారు. రాహుల్ను తదుపరి ప్రధానిని చేయాలని తేజస్వి ఇటీవల ప్రకటించారు కదా? అని తిరిగి అడిగినప్పుడు, ఆ ఇద్దరి నేతల మధ్య కెమిస్ట్రీని ఇటీవల జరిగిన ఓటర్ అధికార్ యాత్రలో చూశామని, వాళ్లే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని గెహ్లాట్ సమాధానమిచ్చారు.
బిహార్లోని 243 స్థానాల్లో ఆర్జేడీ 143, కాంగ్రెస్ 61 సీట్లలో పోటీ చేస్తున్నాయి. అయితే దాదాపు ఐదు సీట్లలో స్నేహపూర్వకంగా పోటీ పడుతున్నాయి. కూటమి భాగస్వామ్య పార్టీ అయిన సీపీఐపై మూడు స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ తరహా స్థానాలు మొదటి విడతలో ఐదు వరకూ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి
వైట్హౌస్లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి