President Droupadi Murmu: రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం..
ABN , Publish Date - Oct 22 , 2025 | 10:04 AM
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆమె కేరళ పర్యటనలో ఉన్నారు.
తిరువనంతపురం, అక్టోబర్ 22: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. బుధవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కేరళలో కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో ఈ హెలికాఫ్టర్ ఒక వైపునకు భూమిలోకి కూరుకుపోయింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమైయ్యారు. వారంతా కలిసి ఒరిగిపోయిన హెలికాఫ్టర్ను సరి చేశారు. దీంతో భద్రతా సిబ్బంది సాయంతో ముర్ము.. హెలికాప్టర్ నుంచి కిందకి దిగారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
కేరళలో పర్యటన కోసం..
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో ఆమెకు ఆ రాష్ట్ర గవర్నర్, సీఎంతోపాటు ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె రాజ్భవన్కు చేరుకున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా శబరిమల, శివగిరిలోని దేవాలయాలను రాష్ట్రపతి ముర్ము సందర్శించుకోని.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే రాజ్భవన్లో మాజీ రాష్ట్రపతి కె. ఆర్. నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పాలలో సెయింట్ థామస్ కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆమె పాల్గొంటారు. అదే విధంగా ఎర్నాకుళంలోని సెయింట్ ధెరిసా కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో సైతం రాష్ట్రపతి పాల్గొనున్నారు.
ఇక ఈ రోజు షెడ్యూల్ ప్రకారం.. రాష్టప్రతి ముర్ము పర్యటన వివరాలు.. బుధవారం ఉదయం 9.25 గంటలకు హెలికాప్టర్లో నీలక్కల్కు బయలుదేరి 11.50 గంటలకు శబరిమల చేరుకుంటారు. శబరిమలలో కొలువు తీరిన అయ్యప్ప స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడి అతిథి గృహానికి చేరుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 4.20 గంటలకు శబరిమల నుంచి బయలుదేరి తిరువనంతపురంకు చేరుకుని.. రాజ్భవన్కు వెళ్తారు. మరోవైపు రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శబరిమలలో భారీగా ఆంక్షలు విధించారు. అలాగే అత్యధిక సంఖ్యలో పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చపాతీలు మెత్తగా.. మృదువుగా రావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి
For More National News And Telugu News