Youth Employment: నిరుద్యోగులకు బంపరాఫర్.. భారీగా ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:20 AM
కడప జిల్లాలోని పట్టణ ప్రాంతంలో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు, కుటుంబ సభ్యులకు మెరుగైన జీవనోపాదులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం మెగా జాబ్మేళాను శనివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు కడపలో మెగా జాబ్మేళా
తరలివస్తున్న కంపెనీలు
జిల్లాలో ఉపాధి పొందే అవకాశాలు
కడప ఎన్టీఆర్ సర్కిల్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పట్టణ ప్రాంతంలో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు, కుటుంబ సభ్యులకు మెరుగైన జీవనోపాదులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం మెగా జాబ్మేళాను (Kadapa Mega Job Mela) శనివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల నుంచి వారికి అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రిజిస్ట్రేషన్లు చేపట్టారు.
జిల్లాలో నిరుపేదల కుటుంబాల్లో చదువుకుని ఉద్యోగావకాశాలు లేక ఇంటి వద్ద ఉంటున్న వారికి ఉపాధి కల్పించేందుకు పట్టణ, పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా సిబ్బంది సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మొత్తం 6997 మంది తమకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ నమోదు చేసుకున్నారు. ఇందులో యువతులు 5353 మంది యువకులు 1644 మంది ఉన్నారు. వీరిలో 10వ తరగతి ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీ విద్యనభ్యసించిన వారు ఉన్నట్లు తెలుస్తుంది. 18 - 35 సంవత్సరాల వయసు ఉన్న వారే ఈ జాబ్మేళాకు అర్హులని అధికార యంత్రాంగం పేర్కొంది. ఇందుకు సంబంధించి నగరంలోని గాంధీనగర్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం 10గంటల నుంచి జాబ్మేళా నిర్వంచనున్నారు. పేర్లు నమోదు చేసుకున్నవారు తమ విద్యార్హత పత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది.
అత్యధిక మందికి కడపలోనే కొలువులు
మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే నిపుణ జాబ్మేళా కార్యక్రమానికి 16 కంపెనీలు హాజరవుతున్నాయి. ఇందులో కడప జిల్లాలోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలున్నాయి. ఇన్నోవ్సోర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్టోర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్ విద్యార్హత. నెలకు రూ.16వేలు వేతనం ఉంటుంది. పేటీయం సంస్థలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు పదోతరగతి నుంచి డిగ్రీవరకు అర్హతగా ఏడాదికి రూ.2 నుంచి రూ. 4 లక్షల వరకు వేతనం పొందే అవకాశాలున్నాయి. జస్ట్ డయల్ కంపెనీలో ఫీల్డ్ సేల్స్ టెలిమార్కెటింగ్ ఉద్యోగాల కోసం ఇంటర్ నుంచి డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. ఏడాదికి రూ. 2.50 లక్షల నుంచి రూ. 3లక్షల వరకు వేతనం ఉంటుంది. ఎల్అండ్టీ కంపెనీలో ఫస్ట్లైన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి ఇంటర్ నుంచి డిగ్రీ అర్హత కలిగిన యువకులకు మాత్రమే అవకాశం ఉంటుంది.
రూ.2 నుంచి రూ.2.50 లక్షల వరకు ఏడాదికి వేతనంగా ఉంటుంది. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్ ఫార్మసీ అసిస్టెంటు ఉద్యోగాలకు బీఫార్మసీ, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, బీఫార్మసీ, డిప్లమా బీఫార్మసీ, విద్యార్హతలుగా పెట్టారు. వేతనం రూ. 14 నుంచి రూ.25వేల వరకు ఉంటుంది. మెడ్ప్లస్ కంపెనీలో సీఎస్ఏ ఫార్మఏడ్, ఫార్మసిస్ట్ అవకాశాలున్నాయి. ఎస్ఎస్ఏ నుంచి ఏదైనా డిగ్రీకానీ, బీఫార్మసీ, డి.ఫార్మసీ, ఎంఫార్మసీ విద్యార్హతలు కలిగి ఉండాలి. నెలకు రూ.12 నుంచి రూ.20వేల వరకు వేతనం ఉంటుంది. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఇంటర్న్షిప్ ఉద్యోగం కోసం డిగ్రీ అర్హత కలిగిన యువకులకు మాత్రమే ఉద్యోగావకాశాలు ఉంటాయి. వేతనం రూ.12వేల నుంచి రూ.14వేల వరకు ఉంటుంది. భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ లిమిటెడ్ నందు ఫీల్డ్ అసిస్టెంటు ఉద్యోగాలకు ఇంటర్ ఆపై విద్యార్హత ఉండాలి. యువకులు మాత్రమే అర్హులు. రూ.14,575 వేతనంతో పాటు ఇన్సెంటివ్, పెట్రోలు చార్జి చెల్లిస్తారు. టాటాట్రెంట్ లిమిటెడ్లో సేల్స్ అసోసియేట్ ఉద్యోగం కోసం ఎస్ఎస్ఎసీ నుంచి డిగ్రీ వరకు విద్యార్హత.
దీనికి రూ.15వేలు వేతనం ఉంటుంది. ప్రీమియర్ హెల్త్ కేర్ సర్వీసెస్ సంస్థలో నర్సింగ్, కేర్టేకర్ ఉద్యోగాలున్నాయి. పదో తరగతి ,ఇంటర్, డిగ్రీ బీఎస్సీ నర్సింగ్, ఏఎన్ఎం, జీఎన్ఎం విద్యార్హతలు ఉన్న వారు అర్హులు. నెలకు రూ.15వేల నుంచి రూ.35 వేల వరకు వేతనంతో పాటు వసతి కల్పించనున్నారు. హైదరాబాద్, విజయవాడల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. టాక్సస్ నిట్లో అసిస్టెంట్ మేనేజరు ఉద్యోగానికి డిగ్రీ విద్యార్హత. యువతీ, యువకులు అర్హులు. సంవత్సరానికి రూ. 4.42 లక్షల వేతనం. పాన్ ఇండియాలో పని చేయాలి. మణిపాల్ కంపెనీలో డిప్యూటీ మేనేజరు, బ్యాంకు రిలేషన్ షిప్ ఆఫీసరు, పర్సనల్ బ్యాంకర్, బిజినెస్ డెవలప్మెంటు రిప్రెజెంటేటివ్ ఖాళీలు ఉన్నాయి.
ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులు. ఏడాదికి రూ.3నుంచి రూ. 6 లక్షల వరకు వేతనం ఉంటుంది. దేశవ్యాప్తంగా పనిచేయాలి. రిలయన్స్ నిబన్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలో జూనియర్, సీనియర్ సేల్స్ మేనే జరు ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చదివిన వారు అర్హులు. ఏడాదికి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5లక్షల వరకు వేతనం ఉంటుంది. భారత్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో టెలికాలర్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టీం లీడర్స్, టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి. పది నుంచి డిగ్రీ చదివిన యుతీ యువకులు అర్హులు. నెలకు రూ.15వేల నుంచి రూ.40వేల వరకు వేతనం ఉంటుంది. ఐ ప్రాసెస్ కంపెనీలో వీకండ్ సేల్స్ సపోర్టు, మార్కెటింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ విద్యార్హతతో పాటు అనుభవం గల వారికి అవకాశం ఉంటుంది. నెలకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు వేతనం ఉంటుంది. టాటా ఎలక్టానిక్స్లో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం ఇంటర్, డిగ్రీ, డిప్లమా చదివిన వారు అర్హులు. నెలకు రూ.15వేలు వేతనం ఉంటుంది. బెంగళూరులోని హుసూర్ రోడ్డులో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి
జాబ్మేళాను యువతీ యువకులు సద్వినియోగం చేసుకుని తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. జాబ్మేళాలో ఎంపిక కాని వారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా తమలోని నైపుణ్యత పెంపొందించుకుని భవిష్యత్తులో నిర్వహించే జాబ్మేళా ద్వారా ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
-కిరణ్కుమార్, పీడీ మెప్మా
ఈ వార్తలు కూడా చదవండి..
సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..
Read Latest AP News And Telugu News