Minister Sarbananda Sonowal: విశాఖకు శివాలిక్ నౌక.. స్వాగతం పలికిన కేంద్రమంత్రి సోనోవాల్
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:23 PM
భారత సముద్ర రవాణా వాణిజ్య రంగంలో శివాలిక్ కీలక పాత్ర పోషించనుందని సర్బానంద సోనోవాల్ తెలిపారు. 2030 నాటికి ప్రపంచంలోని షిప్ బిల్డింగ్ దేశాలలో భారత్ టాప్ 10లో ఒకటిగా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్సీఐ) యాజమాన్యం కిందకు వచ్చిన వీఎల్జీసీ(శివాలిక్) నౌక తొలిసారిగా దేశంలోని విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది. శివాలిక్ నౌకకు సర్బానంద సోనోవాల్ విశాఖ సముద్రంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
భారత సముద్ర రవాణా వాణిజ్య రంగంలో శివాలిక్ కీలకపాత్ర పోషించనుందని సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ నౌక తన తొలి ప్రయాణంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పిజీ)ను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. 2030 నాటికి ప్రపంచంలోని షిప్ బిల్డింగ్ దేశాలలో భారత్ టాప్-10లో ఒకటిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి టాప్-5 దేశాలలో భారత్ ఒకటిగా ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. దేశంలో మెరిటైం అభివృద్ధికి ప్రతి ఏటా రూ.6లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ఆత్మనిర్బర్ భారత్లో భాగంగా 112 నౌకల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ నెలలో నాలుగు షిప్పులకు టెండర్ ప్రక్రియ నిర్వహిస్తామని సర్బానంద సోనోవాల్ తెలిపారు. భారత సముద్ర రవాణా రంగంలో ఇదొక మైలురాయని చెప్పారు. ఏపీలో దుగ్గిరాజపట్నం వద్ద నౌకా నిర్మాణ కేంద్రానికి డీపీఆర్ పూర్తయిందని స్పష్టం చేశారు. దుగ్గరాజుపట్నం వద్ద నౌక నిర్మాణ కేంద్రానికి కేంద్రం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు. భారతదేశ విదేశీ వాణిజ్యంలో 70 శాతం సముద్ర మార్గాల ద్వారా రవాణా చేయబడతాయని పేర్కొన్నారు. భారతీయ వస్తువులపై 25 శాతం అదనపు సుంకం విధించాలనే అమెరికా చర్య అన్యాయం, అసమంజసమైనదని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు