Share News

Liquor Scam: ఇక లిక్కర్‌ బాసుల వంతు

ABN , Publish Date - May 10 , 2025 | 03:30 AM

వేల కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ మాజీ అధికారులు ధనుంజయ్‌, కృష్ణమోహన్‌, గోవిందప్పలకు సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ ముగ్గురిపై విచారణ, బెయిల్‌ ప్రక్రియలతో డ్రామా కొనసాగుతోంది

Liquor Scam: ఇక లిక్కర్‌ బాసుల వంతు

  • ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పకు నోటీసులు

  • రేపు విచారణకు రావాలని పిలిచిన సిట్‌... హైదరాబాద్‌లోని ఇళ్లకు బృందాలు

  • అప్పటికే ఆ ముగ్గురూ అజ్ఞాతంలోకి.. దీంతో వారి ఇళ్లలోనివారికి నోటీసులు

  • ‘బెయిల్‌’పై 13న హైకోర్టు విచారణ.. 11న సిట్‌ ముందు హాజరు అనుమానమే!

అమరావతి, మే 9 (ఆంధ్రజ్యోతి): ఒకరు నిత్యం జగన్‌ వెంట ఉండే బంటు ఓఎస్‌డీ కృష్ణమోహన్‌ రెడ్డి. మరొకరు ఐదేళ్లపాటు సీఎంవోలో అన్నీ తానై వ్యవహరించిన సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి. మూడోవ్యక్తి పదిహేనేళ్లుగా భారతీ సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌గా ఉంటూ ఆర్థిక వ్యవహారాలు, ఇతర లావాదేవీలు చక్కబెడుతున్న గోవిందప్ప బాలాజీ! రూ. వేల కోట్ల మద్యం స్కామ్‌లో ఈ ముగ్గురినీ ఆదివారం విచారణకు రమ్మని సిట్‌ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌ వెళ్లిన మూడు బృందాలు అత్తాపూర్‌లోని ఉప్పరపల్లి సన్‌రైజ్‌ విల్లాలో ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికెళ్లాయి. ఆయన లేకపోవడంతో కుమారుడు రోహిత్‌రెడ్డి చేతికి నోటీసు ఇచ్చాయి. గోవిందప్ప ఇంటికెళ్లి ఆయన భార్యకు నోటీసు అందజేశారు. ధనుంజయ్‌ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో కుటుంబసభ్యులకు ఇచ్చి వెనుదిరిగారు.


వేల కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడిన తాడేపల్లి ప్యాలెస్‌ ముఖ్యలకు అతి దగ్గరగా ఉండే ఈ ముగ్గురు మొత్తం కుట్రలో భాగస్వాములని సిట్‌ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. స్కామ్‌లో కింగ్‌ పిన్‌గా భావిస్తున్న రాజ్‌ కసిరెడ్డి (ఏ1), వాసుదేవరెడ్డి (ఏ2), విజయసాయిరెడ్డి (ఏ4), మిథున్‌ రెడ్డి (ఏ6)తో కలిసి అన్ని స్థాయిల్లోనూ సమావేశమై వీరు చర్చలు జరిపారని గుర్తించింది. ఏ31గా ధనుంజయ్‌రెడ్డి, ఏ32గా కృష్ణమోహన్‌రెడ్డి, ఏ33గా గోవిందప్పని నిందితుల జాబితాలో చేర్చింది. హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా వీరికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో సిట్‌ అధికారులు ఎప్పుడైనా అరెస్టు చేస్తారనే అనుమానంతో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో దాఖలు చేసి ముగ్గురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నెల 13న హైకోర్టులో పిటిషన్‌పై విచారణ ఉన్నందున 11న సిట్‌ ముందుకు వస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.


fsed.jpg

ఐదేళ్లపాటు అన్నీ తానై..

ఉమ్మడి కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన ధనుంజయ్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. వైఎస్‌ కోటరీలో ధనుంజయ్‌రెడ్డి కీలక సభ్యుడనే వ్యాఖ్యలు వినిపించేవి. రాష్ట్ర విభజన తర్వాత 2019లో జగన్‌ సీఎం అయ్యాక ధనుంజయ్‌ రెడ్డికి తిరుగులేని పెత్తనం వచ్చేసింది. సీఎస్‌, డీజీపీ లాంటి వారి నియామకానికి ముందే సీఎంవో కార్యదర్శిగా నియమితులయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎందరో అధికారులను మార్చేసినా ధనుంజయ్‌ రెడ్డి మాత్రం సీఎంవో నుంచి పక్కకు కదల్లేదు. అపరిమితమైన అధికారాలు చెలాయిస్తూ ప్రతి పనిలోనూ వేలు పెట్టి కీలక వ్యవహారాలు చక్కబెట్టారు. జగన్‌ తరపున అనేక వ్యవహారాలు చక్కబెట్టిన ఆయన మద్యం స్కామ్‌లోనూ కీలకంగా వ్యవహరించారు. ఏపీఎ్‌సబీసీఎల్‌ ఎండీగా వాసుదేవరెడ్డిని, ఓఎస్‌డీగా సత్యప్రసాద్‌ను నియమించడం నుంచి రాజ్‌ కసిరెడ్డి పంపించే భారీ నగదు తాడేపల్లి పెద్ద చెప్పిన చోటుకు చేర్చేదాకా... ధనుంజయ్‌రెడ్డి పాత్రను నిర్ధారించే ఆధారాలను సిట్‌ సేకరించింది. అంతిమ లబ్ధిదారు ఎవరనేది తేల్చే పనిలో పడింది.


ముడుపులు మళ్లించిన గోవిందప్ప..

ఉమ్మది చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన గోవిందప్ప భారతీ సిమెంట్స్‌లో 2010 ఏప్రిల్‌ నుంచి పూర్తి కాలపు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. వృత్తిరీత్యా చార్టెడ్‌ అకౌంటెంట్‌ కావడంతో భారతీ సిమెంట్స్‌ ఆర్థిక, ఆదాయ పన్ను వ్యవహారాలు చూసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లిక్కర్‌ పాలసీ నుంచి ముడుపుల వసూళ్ల వరకూ ప్రతి అడుగులోనూ ఆయన పాత్ర ఉంది. మద్యం ముడుపులు మళ్లింపులో కీలక పాత్ర పోషించారు. రాజ్‌ కసిరెడ్డి తెచ్చి ఇచ్చిన కోట్లాది రూపాయలు ఊరు పేరు లేని కంపెనీల్లోకి గోవిందప్ప మళ్లించారు. మొత్తం బాగోతాన్ని పసిగట్టిన సిట్‌ అధికారులు ఆయనను విచారించి అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చబోతున్నారు.


వైఎస్‌.. విజయమ్మ.. జగన్‌తో..

గతంలో ఆర్డీవోగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డిది నల్లగొండ జిల్లా. వైఎస్‌ హయంలో పులివెందుల అర్బర్‌ డెవలప్మెంట్‌ అధారిటీ కమిషనర్‌గా పని చేస్తూ రాజశేఖరరెడ్డి కుటుంబానికి దగ్గరయ్యారు. వీఆర్‌ఎస్‌ తీసుకుని వైఎస్‌ తర్వాత జగన్‌ చెంతకు చేరారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ జగన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు విజయమ్మ వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి ఆ కుటుంబంలో ఒకరయ్యారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేక మరణ వార్త జగన్‌కు చెప్పేందుకు కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఫోన్‌ చేసింది కృష్ణమోహన్‌ రెడ్డి నంబర్‌కే. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు కడప సెంట్రల్‌ జైలు లోపల క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసుకుని అప్పట్లో కృష్ణమోహన్‌రెడ్డిని పిలిచారు. విచారణకు హాజరైన ఆయనను అప్పటి సీఎస్‌ జవహార్‌ రెడ్డి కారులో వెళ్లి తీసుక రావడం సంచలనమైంది. తాడేపల్లి, పులివెందుల, ఇడుపులపాయ, లోటస్‌ ఫాండ్‌, యలహంక ప్యాలె్‌సలలో జగన్‌ కుటుంబ సభ్యుడిలా ఉండే కృష్ణమోహన్‌ రెడ్డికి మద్యం ముడుపులు ఎక్కడికి చేరాయో తెలుసునని సిట్‌ బలంగా నమ్ముతోంది. దానిపై విచారించేందుకే ఆయనకు సిట్‌ అధికారులు నోటీసు ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మిస్ వరల్డ్ 2025 వేడకలు..

ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్

పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్

For More AP News and Telugu New

Updated Date - May 10 , 2025 | 03:30 AM