Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. గోవాలో నకిలీ మద్యం డంప్
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:00 PM
నకిలీ మద్యం కేసులో దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతం నిందితుల సంఖ్య 23కు చేరింది.
విజయవాడ: నకిలీ మద్యం కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోవాలో నకిలీ మద్యం కేంద్రాన్ని గుర్తించినట్లు సిట్ అధికారులు తెలిపారు. వైసీపీ హయాంలో జనార్ధన్రావుతో కలిసి కేరళకు చెందిన జినేష్ అనే వ్యక్తి గోవాలో కల్తీ లిక్కర్ డంప్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సౌత్ గోవా, నార్త్ గోవా, పనాజీ, మార్గావ్లో కల్తీ లిక్కర్ విక్రయాలు జరిపినట్లు చెప్పారు. మరోవైపు నకిలీ మద్యం కేసు దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి.
దీంతో నిందితుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతం నిందితుల సంఖ్య 23కు చేరింది. వీరిని విచారించి, అరెస్టు చేసేందుకు ఎక్సైజ్, సిట్ అధికారులు చర్యలు చేపట్టారు. నిందితులు అద్దేపల్లి జనార్దన్రావు, జగన్మోహన్రావులకు వీరు పలురకాలుగా సాయం చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. కాగా, నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను ఆయన సోదరుడు రామును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
జోగి రమేష్, జనార్దన్రావుల మధ్య సాగిన వాట్సప్ సంభాషణలు, అద్దేపల్లి సోదరులు జోగి రమేష్తో కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని చేపట్టినట్లు విచారణలో ప్రధాన నిందితుడు జనార్దన్రావు వెల్లడించారు. రూ.3 కోట్ల ఆర్థిక సాయం చేస్తానని, ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టినట్లు చెప్పారు. మాజీ మంత్రి ప్రోద్బలంతోనే తయారీని చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించి వీడియో, స్టేట్మెంట్లను ఇప్పటికే సిట్.. కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ను ఆయన సోదరుడు రామును పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిలో భాగంగా విచారణ చేపట్టిన సిట్ అధికారులు గోవాలో కల్తీ లిక్కర్ డంప్ను గుర్తించారు.
ఇవి కూడా చదవండి:
Electricity Department: అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్స్టేషన్లు
AP Assembly House Committee: వైసీపీ హయాంలో అవినీతిపై 17లోగా నివేదిక