Share News

Amaravati Construction: రాజధానిపై మూడు ముక్కలాట.. గత సర్కార్‌పై మంత్రి ఫైర్

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:15 PM

భూములిచ్చిన రైతుల‌కు అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉందని మంత్రి నారాయణ అన్నారు. గ‌త ప్ర‌భుత్వం రాజ‌ధానిని నిర్వీర్యం చేసి మూడుముక్క‌లాట ఆడిందని మండిపడ్డారు.

Amaravati Construction: రాజధానిపై మూడు ముక్కలాట.. గత సర్కార్‌పై మంత్రి ఫైర్
Amaravati Construction

అమ‌రావ‌తి, సెప్టెంబర్ 24: రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ (Minister Narayana) సమాధానం ఇచ్చారు. అమ‌రావ‌తిలో సీఆర్డీఏ నుంచి 21 ప‌నులు, ఏడీసీ నుంచి 64 ప‌నులు చేప‌ట్టారన్నారు. రాజ‌ధాని కోసం 35,000 ఎక‌రాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీం ద్వారా తీసుకున్నామని వెల్లడించారు. భూములిచ్చిన రైతుల‌కు అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉందన్నారు. గ‌త ప్ర‌భుత్వం రాజ‌ధానిని నిర్వీర్యం చేసి మూడుముక్క‌లాట ఆడిందని మండిపడ్డారు. అమ‌రావ‌తిలో చెట్లు తొల‌గించేందుకు రూ.30 కోట్లు ఖ‌ర్చు పెట్టాల్సి వ‌చ్చిందని వివరించారు.


ట్రంక్ రోడ్లు, లే అవుట్ రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జ‌డ్జిల బంగ్లాలు, అధికారులు, ఉద్యోగుల నివాసాలు నిర్మాణం జ‌రుగుతుందన్నారు. గ‌త రెండు నెల‌లుగా వ‌ర్షాల వ‌ల్ల అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌కు ఆటంకం క‌లిగిందని తెలిపారు. ప్ర‌స్తుతం 10 వేల మంది కార్మికులు అమ‌రావ‌తి ప‌నుల్లో పాల్గొంటున్నారని.. మార్చి 31 నాటికి 3500 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జాతీయ‌,అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో రాజ‌ధాని నిర్మాణం చేయాల‌నే ఉద్దేశంతో టెండ‌ర్ నిబంధ‌న‌లు పెట్టామని మంత్రి నారాయణ వెల్లడించారు.


విశాఖ ఎమ్మెల్యేల ప్రశ్నపై...

విశాఖ మౌలిక సదుపాయాలకు సంబంధించి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయ సమాధానం ఇచ్చారు. జీవీఎంసీని నియోజ‌క‌వ‌ర్గాల ప్రాతిప‌దిక‌న 10 జోన్‌లుగా విభ‌జించామని... త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. జోనల్ క‌మిష‌నర్‌ల‌కు అధికారాల‌పై ప‌రిశీల‌న చేసి నిర్ణ‌యం తీసుకుంటామని చెప్పారు. విశాఖ‌లో రూ.665 కోట్ల‌తో సీవ‌రేజి ప్రాజెక్ట్‌కు త్వ‌ర‌లో టెండ‌ర్లు పిలుస్తామన్నారు. జీవీఎంసీ ప‌రిధిలో తాగునీటి కోసం కొత్త‌గా ప్రాజెక్ట్ అమ‌లు చేయ‌న‌న్నామని తెలిపారు. విశాఖ‌ప‌ట్నంలో డ్రెయిన్లు 4863 కి.మీ మేర అవ‌స‌రం ఉండ‌గా 3583 కిమీ మేర‌ ఉన్నాయని.. మ‌రో 193 కిమీ మేర డ్రెయిన్ల ప‌నులు జ‌రుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.


విశాఖ‌లో రోడ్లు వెడ‌ల్పు చేసిన చోట వివిధ కార‌ణాల‌తో టీడీఆర్ బాండ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సింహాచలం టీడీఆర్ బాండ్ల‌పై దేవ‌దాయ శాఖ అధికారుల‌తో చ‌ర్చిస్తున్నామన్నారు. త‌ణుకు టీడీఆర్ బాండ్ల వివాదం త‌ర్వాత ఇత‌ర కార్పొరేష‌న్‌ల‌లో బాండ్ల జారీ ఆల‌స్యం అయిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

దసరాకు సిద్ధమవుతున్న సీఆర్డీఏ భవనం.. పరిశీలించిన మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 12:20 PM