AP CM Chandrababu: జూలై 10కి జలాలు
ABN , Publish Date - May 10 , 2025 | 03:52 AM
హంద్రీ-నీవా ద్వారా జూలై 10న నీటి విడుదల చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 3,873 కోట్లతో పనులు పూర్తి చేసి రాయలసీమను పంటల తోటగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు

హంద్రీ-నీవా నీటి విడుదలపై సీఎం ప్రకటన
పనుల పూర్తికి 3,873 కోట్లు ఖర్చు చేస్తున్నాం
ఫేజ్-1లో 1.98 లక్షల ఎకరాలకు సాగునీరు
తర్వాతి దశలో 4.04 లక్షల ఎకరాలకు
ఈ ప్రాజెక్టుపై గత పాలకుల నిర్లక్ష్యం
మా ప్రభుత్వం వచ్చాకే పనుల్లో వేగం
రాష్ట్రమంతటా సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం
పీ-4తో పేదరిక నిర్మూలనకు శ్రీకారం
ఛాయాపురం ప్రజావేదికలో చంద్రబాబు వెల్లడి
ఒకప్పుడు కోనసీమ అందాల సీమ. సినిమాలు తీసేవారు. అక్కడ నీళ్లున్నా అవకాశాలు లేవు. ఇప్పుడు అనంతపురం జిల్లాకు నీళ్లు వచ్చాయి.. అవకాశాలు పెరిగాయి. దీని మూలంగా అభివృద్ధిలో అనంతపురం జిల్లా 13వ స్థానానికి చేరుకుంది. అయితే ఇది టాప్ 3లో ఉండాలి.
ఇరిగేషన్కు సమాంతరంగా మైక్రో ఇరిగేషన్కు ఖర్చుపెడితే సామర్థ్యం పెరగడంతోపాటు నీటి వినియోగం తగ్గుతుంది. సంపద సృష్టించేందుకు ఇదొక మంచి పద్ధతి.
ఆ ఐదేళ్లలో సీఎం పర్యటనకు వస్తే.. చెట్లు నరికేసేవాళ్లు.. పరదాలు కట్టుకునేవాళ్లు.. సభలకు మనుషులను తోలేవాళ్లు. వాళ్లు మధ్యలో వెళ్లిపోకుండా నిర్బంధించేవారు. నేనలాంటి పనులు చేయడం లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టడం లేదు.
- సీఎం చంద్రబాబు
అనంతపురం మే 9 (ఆంధ్రజ్యోతి): హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా ఈ ఏడాది జూలై 10న నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం ఫేజ్-1, 2 కింద 554 కిలోమీటర్ల మేర కాలువ విస్తరణ, లైనింగ్ పనులకు రూ.3,873 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే ఐదేళ్లపాటు దీని పనులు ఆగిపోయాయన్నారు. కూటమి అధికారంలోకి రాగానే శరవేగంగా పనులు పూర్తి చేస్తోందన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం సమీపంలో హంద్రీ-నీవా కాలువ విస్తరణ, లైనింగ్ పనులను ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ అధికారులు పర్యటించారు. ఏ రోజుకా రోజు పనులు ఏ మేరకు సాగుతున్నాయో డ్రోన్ ద్వారా వివరాలు సేకరించి, ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. త్వరితగతిన పూర్తయ్యేలా శ్రద్ధ పెట్టాలని, జూలై 10 నాటికి నీటి విడుదలకు సమాయత్తం కావాలని స్పష్టంచేశారు. అనంతరం ఛాయాపురంలో ప్రజావేదికలో స్థానికులనుద్దేశించి మాట్లాడారు. హంద్రీ-నీవా, పోలవరం-బనకచర్ల పథకాలు పూర్తయితే రాయలసీమలో కరువు మాటే వినిపించదన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే..
రతనాల సీమ చేస్తానని ఆరోజే చెప్పా..
1996 మార్చి 11న ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేశాను. ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ కల. మిగులు జలాలు వాడుకోవడానికి ఆయన హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, రాయలసీమ దశ-దిశ మార్చారు. నేను సీఎం అయ్యాక సీమ ఎడారిగా మారకుండా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. రాయలసీమను రతనాల సీమగా చేస్తానని ఆరోజే చెప్పాను. రా కదలిరా కార్యక్రమంలో భాగంగా ఉరవకొండకు వచ్చాను. ఉమ్మడి జిల్లాలో 14 సీట్లూ ఇవ్వండి.. నా మీద నమ్మకం పెట్టండని కోరాను. 14 సీట్లతోపాటు రెండు ఎంపీ సీట్లను కూడా ఇచ్చారు. హంద్రీ-నీవాను వెడల్పు చేస్తానని చెప్పాను. చెప్పిన గంటలోనే జీవో జారీ చేశాను. ఇప్పటికి 37 శాతం పనులు పూర్తి చేశాం. ప్రాజెక్టు పూర్తయితే సీమలో ఫేజ్-1లో 1.98 లక్షలు, ఫేజ్-2లో 4.04 లక్షల ఎకరాలకు నీరందుతుంది.
ఎన్నికలొస్తే పక్కచూపులు..: ఇప్పుడు మీరంతా బాగుంటారు. ఎన్నికలొస్తే కొందరు పక్క చూపులు చూస్తారు. ఆ పక్క చూపుల వల్ల రాష్ట్రం ఇబ్బందుల్లో పడింది. నాలో తప్పుందా.. మీలో తప్పుందా అని ఆలోచిస్తూ ఉంటాను. హైదరాబాద్ను 9 సంవత్సరాల్లో అభివృద్ధి చేశాం. అయినా 2004లో ఎన్నికల్లో ఓడిపోయాం. 2014లో రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉన్నా హంద్రీ-నీవా సహా అన్నీ ముందుకు తీసుకెళ్లాం. గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి, నీళ్లు చూపించి, కియా కంపెనీని జిల్లాకు తీసుకొచ్చాం. కరువు జిల్లా నుంచి ప్రపంచానికి కియా కార్లు వెళ్తున్నాయంటే అదీ టీడీపీ సత్తా. అలాంటి చరిత్ర సృష్టిస్తే మీరు 2019లో జిల్లాలో టీడీపీకి రెండే సీట్లు ఇచ్చారు. దాంతో వెనక్కి వెళ్లాం. జగన్ ఐదేళ్లలో హంద్రీ-నీవా కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా..? ఏ రోడ్డుకైనా మట్టి వేశారా..? గుంతలు పూడ్చారా..? కాలువల్లో గంప మట్టి తీశారా? (లేదని జనం నినదించారు) ఇప్పుడు రూ.3,873 కోట్లు మంజూరు చేసి పనులు చేస్తున్నాం. కాలువను 16.05 మీటర్లకు వెడల్పు చేస్తున్నాం. ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ ఈ సీజన్లోనే పూర్తి చేస్తాం. 40 టీఎంసీల నీళ్లు తీసుకొస్తాం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కుప్పం వరకు హంద్రీ-నీవా కాలువ 773 కిలోమీటర్ల పొడవు ఉంది. ఆసియాలోనే ఎక్కువ పొడవైన కాలువ. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. సీమలోని అన్ని రిజర్వాయర్లు, చెరువుల్లో నీరు నింపాం. అవసరమైతే చిన్న చిన్న లిఫ్టులు పెట్టి ఉమ్మడి జిల్లాలోని అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. గోదావరి నుంచి ఏటా 2 వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. అందులో 300 టీఎంసీలు తెచ్చుకోగలిగితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలమైపోతుంది. పోలవరం నుంచి బనకచర్లకు నీరు తేవాలంటే రూ.81 వేల కోట్లు కావాలి. సుసాధ్యం చేసే సంకల్పంతో ముందుకెళ్తున్నాం.
దేశంలో ఎక్కడా లేనంతగా..
గత 11 నెలల్లో దేశంలో ఎక్కడా చేయని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. దీపం-2 కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే అన్నం పెడుతున్నాం. 16,500 పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేశాం. అన్నదాతకు పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తాం. కేంద్రం ఇచ్చిన తేదీనే రాష్ట్రం తరపున రూ.14 వేలు 3 విడతల్లో జమ చేస్తాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ డబ్బులిస్తాం.
గతంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే..
గతంలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలే. ఇప్పుడు బాగుపడ్డాయా.. లేదా? (బాగున్నాయంటూ ప్రజలు చేతులెత్తి సమాధానం చెప్పారు). ఈ రోడ్లు ఇంకా బాగుపడాలి. సంపద సృష్టి జరగాలి. ఆదాయం పెరగాలి. పేదరికం నుంచి అందరినీ పైకి తీసుకురావాలి. నేను సాధారణ కుటుంబంలో పుట్టాను. మా నాన్నా రైతే. గాంధీజీ, అంబేడ్కర్, అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, మోదీ.. వీరంతా సామాన్య వ్యక్తులే. అంబేడ్కర్కు బరోడా రాజు అండగా నిలబడ్డారు. ఆయనిచ్చిన డబ్బులతో లండన్లో చదువుకుని రాజ్యాంగం రచించారు. అబ్దుల్ కలాంకు అయ్యంగార్ అండగా నిలబడ్డారు. నేనూ అదే చేస్తున్నా. పైనున్న 10 శాతం మంది.. కింది స్థాయిలో ఉన్న 20 శాతం మందిని దత్తతకు తీసుకుని, ఆదుకోవాలి. 2029 నాటికి పీ-4తో పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడమే లక్ష్యం.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్
పాక్ దాడులపై ఎక్స్లో భారత ఆర్మీ పోస్ట్
For More AP News and Telugu New