Pawan Urges Janasena Cadres: పార్టీ కేడర్తో సమావేశం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:58 PM
రాష్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అలాంటి వేళ.. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు కుట్రలు మొదలయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి దిశగా.. సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్నామని అలాంటి వేళ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు కుట్రలు మొదలయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ జనసేన పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. శనివారం నాడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శ్రేణులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. సామాజిక మాధ్యమాల ముసుగులోనో.. యూట్యూబ్ ఛానెళ్ల పేరుతోనో.. కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.
ఇలా కుయుక్తులతో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని గత పదేళ్లుగా చూస్తున్నామని వివరించారు. వారి ఉచ్చులో పడి ఆవేశాలకు లోనై, ఘర్షణ వాతావరణానికి తావీయెుద్దని పార్టీ శ్రేణులకు పవన్ హితవు పలికారు. అలాంటి ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు. ఆ క్రమంలో ఇటీవల మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనను ఈ సందర్భంగా ఆయన ఉదాహరణగా వివరించారు.
ఒక యూట్యూబ్ ఛానెల్లో వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడారని చెప్పారు. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి.. ప్రచారం చేయడం వెనక ఉన్న ఆలోచనను మనం పసిగట్టాల్సి ఉందని పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు. ఈ అంశంపై చట్ట ప్రకారం కేసులు పెట్టి ముందుకు వెళ్లాల్సి ఉందని సూచించారు. అంతేకానీ.. తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణ పడటం ద్వారా సమస్య జటిలం అవుతుందని అభిప్రాయపడ్డారు.
కులాలు, మతాల మధ్య విభేదాలు తీసుకు వచ్చే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయాల్సి ఉందంటూ పార్టీ శ్రేణులకు ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా ముందుకెళ్లాలని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు కూమిటీలోని నేతలకు సీఎం పవన్ కల్యాణ్ వివరించారు. సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్, విశ్లేషకుల ముసుగులో రెచ్చగొట్టే వారిని, అభ్యంతరకర రీతిలో మాట్లాడే వారినీ భారత న్యాయ సంహిత ప్రకారం చట్టం ముందు నిలపాలని పేర్కొన్నారు.
వీరి వెనక ఉండి.. వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టి కుట్రలు చేసే వారిపైనా ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలని పార్టీ కేడర్కు ఆయన సూచించారు. అయితే మచిలీపట్నం వివాదంపై అంతర్గత విచారణ జరపాలంటూ ఇప్పటికే పార్టీలోని నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని వెల్లడించారు. ఈ ఘటనలో పాలు పంచుకున్న వారికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించినట్లు వివరించారు.
కుట్రలు చేసే వారి కుత్సిత నైజం కలిగిన పార్టీ, ఆ పార్టీ నాయకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలాగే రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ముసుగులో అనుసరిస్తున్న వైఖరిపైనా జనసేన పార్టీ కేడర్కు డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. వారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్య యుతంగా, చట్ట ప్రకారం తిప్పికొడదామని పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ కార్యకర్తకు మంత్రి లోకేశ్ అభయ హస్తం
For More AP News And Telugu News