Minister Nara Lokesh: ఇకపై టీచర్లకు బోధనేతర బాధ్యతలు ఉండవు: మంత్రి నారా లోకేష్
ABN , Publish Date - Nov 21 , 2025 | 09:32 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించి పరిష్కరిస్తున్నామని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులంతా లెర్నింగ్ అవుట్ కమ్స్పై శ్రద్ధపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
అమరావతి, నవంబరు21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించి పరిష్కరిస్తున్నామని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులంతా లెర్నింగ్ అవుట్ కమ్స్పై శ్రద్ధపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ(శుక్రవారం) ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్తో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ సమావేశం అయ్యారు.
200 సమస్యలు పరిష్కరించాం: మంత్రి నారా లోకేష్
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారు మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. గత 17నెలల్లో 423 సమస్యలను ఫ్యాప్టో ద్వారా తన దృష్టికి తెచ్చారని.. ఇందులో 200 సమస్యలు పరిష్కరించామని వివరించారు. 81 సమస్యలు పరిష్కార యోగ్యమైనవి కావని. 72 విజ్ఞాపనలు పాలసీ మేటర్స్కు సంబంధించినవని, 71 సమస్యలు కోర్టుల పరిధిలో ఉన్నాయని తెలిపారు. వచ్చేనెలలో మెగా పీటీఎం మినహా ఈ విద్యాసంవత్సరంలో మరే ఇతర విద్యేతర పనులు ఉపాధ్యాయులకు ఉండవని స్పష్టం చేశారు. డీఈఓ, ఎంఈఓలు కేవలం లెర్నింగ్ అవుట్ కమ్స్పైనే దృష్టిపెట్టాలని, వారికి సర్వీసు రూల్స్ బాధ్యతలు అప్పగించబోమని స్పష్టంచేశారు. కడప మోడల్ స్మార్ట్ కిచెన్లను ఏపీవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు మంత్రి నారా లోకేష్.
పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలి: ఏపీటీఎఫ్ నాయకులు
అలాగే, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఏపీటీఎఫ్ నాయకులు మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. టెట్ నుంచి 2011కు ముందు ఉద్యోగంలో చేరిన ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇన్ సర్వీసు టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించి, కటాఫ్ మార్కులను 45శాతానికి తగ్గించాలని సూచించారు. 2003కు ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని అభ్యర్థించారు. కేంద్రప్రభుత్వం జారీచేసిన మెమో 57ను అమలు చేయాలని విన్నవించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుమీడియాన్ని సమాంతర మాధ్యమంగా కొనసాగించాలని కోరారు. మండలానికి ఒక తెలుగుమీడియం స్కూలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న తొమ్మిది రకాల స్కూళ్ల విధానాన్ని సమీక్షించి, 1 నుంచి 5 తరగతులను ఉన్నత పాఠశాలల నుంచి విడదీయాలని సూచించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని, దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు ఏపీటీఎఫ్ నాయకులు.
ఆ విధానానికి స్వస్తి పలకాలి: ఏపీటీఎఫ్ నాయకులు
స్కూలు అసిస్టెంట్లను ఎంఈఓలుగా నియమించే విధానానికి స్వస్తిపలకాలని... ఎంఈఓలుగా ప్రధానోపాధ్యాయులనే నియమించాలని ఏపీటీఎఫ్ నాయకులు సూచించారు. జిల్లాపరిషత్ యాజమాన్యాల్లోని గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులను కూడా నియమించాలని కోరారు. క్లస్టర్లలో ఖాళీగా ఉన్న టీచర్లను అధిక సంఖ్యలో విద్యార్థులు గల పాఠశాలల్లో నియమించాలని కోరారు. ఐటీడీఏలలో పండిట్ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని అన్నారు. కేజీబీవీల్లో టీచర్లకు టైమ్ స్కేల్ ఇవ్వాలని విన్నవించారు. మోడల్ స్కూలు ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ రూపొందించి, గవర్నమెంట్, జిల్లాపరిషత్ వారితో సమానంగా విధివిధానాలు అమలు చేయాలని సూచించారు ఏపీటీఎఫ్ నాయకులు.
బోధనేతర పనుల నుంచి మినహాయించాలి: ఏపీటీఎఫ్ నాయకులు
పరీక్షలు దగ్గరపడుతున్నందున 2025 ప్రకారం బదిలీల్లో ఖాళీ అయిన సబ్జెక్టు టీచర్ పోస్టుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు సూచించారు. ప్రతి మూడునెలలకోసారి ఉపాధ్యాయుల సమస్యలపై సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అసెస్మెంట్ పుస్తకాలకు సంబంధించి మార్కులను అప్లోడ్ చేయడం భారంగా మారిందని అన్నారు. దీనిని పునఃసమీక్షించాలని కోరారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించాలని సూచించారు. యాప్ల అప్లోడ్ భారాన్ని తగ్గించాలని విన్నవించారు. ప్లస్ 2 పాఠశాలల్లో జూనియర్ లెక్చరర్, పీఈటీ పోస్టులను భర్తీచేయాలని కోరారు. 78సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఏపీటీఫ్కు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కల్పించాలని కోరారు. ఏపీటీఫ్ నేతల విజ్ఞాపనలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా కల్పించారు.
ఇవి కూడా చదవండి..
ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూముల రీ సర్వే చేయండి: రఘురామ
విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
Read Latest AP News And Telugu News