Share News

Komati Reddy Venkat Reddy: రాష్ట్రంలో 13 ఎంపీ సీట్లు గెలుస్తాం..

ABN , Publish Date - Jun 02 , 2024 | 03:53 AM

ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ 13 సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి.. ఓ ప్రైవేట్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

Komati Reddy Venkat Reddy: రాష్ట్రంలో 13 ఎంపీ సీట్లు గెలుస్తాం..

  • బీఆర్‌ఎ్‌సకు ఒక్క సీటూ రాదు: మంత్రి కోమటిరెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 1: ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ 13 సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి.. ఓ ప్రైవేట్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని అన్నారు. కేసీఆర్‌ పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. బీఆర్‌ఎ్‌సకు భవిష్యత్తు ఉండదని.. ఆ పార్టీలో ముగ్గురో, ఆరుగురో ఎమ్మెల్యేలే మిగులుతారని వ్యాఖ్యానించారు.


జూన్‌ 4 తర్వాత ఆ పార్టీ గురించి తాను మాట్లాడదలుచుకోలేదని పేర్కొన్నారు. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన గీతం, రాష్ట్ర అధికారిక లోగోపై కేటీఆర్‌ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. రాముడి పేరిట ప్రచారం మినహా పదేళ్లలో బీజేపీ నేతలు చేసిందేమీ లేదన్నారు. పైగా తమ ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌ టాక్స్‌ వసూలు చేస్తోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జూన్‌ 5 నుంచి ప్రభుత్వం దృష్టంతా అభివృద్ధి పైనే ఉంటుందన్నారు. రాష్ట్రంలో యువత కోసం స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో రోడ్ల పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ఇచ్చిన హామీ మేరకు బోధన్‌ చక్కెర కర్మాగారాన్ని పునఃరుద్ధరిస్తామని తెలిపారు.

Updated Date - Jun 02 , 2024 | 03:53 AM