Share News

Rajagopal Reddy: కేసీఆర్ రాజకీయ వారసుడు హరీష్ రావు మాత్రమే..

ABN , Publish Date - Feb 15 , 2024 | 07:19 PM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వారసుడు మాజీమంత్రి హరీష్ రావు మాత్రమేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rajagopal Reddy: కేసీఆర్  రాజకీయ వారసుడు హరీష్ రావు మాత్రమే..

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వారసుడు మాజీమంత్రి హరీష్ రావు మాత్రమేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... హరీష్‌రావు గులాబీ పార్టీ అధ్యక్షుడు అయితేనే ఆ పార్టీ బతుకుతుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంటే మంచిదని సూచించారు. బీఆర్ఎస్ బతకాలంటే హరీష్ రావు పార్టీ అధ్యక్షుడు కావాలన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ అధ్యక్షుడు అయితే. పార్టీ‌లో ఒక్కరు కూడా ఉండరని సెటైర్లు వేశారు. కేటీఆర్ పొలిటీషియన్ కాదు హైటెక్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌లో చాలా మంది నేతలు అవమానానికి గురైనా ఆ పార్టీలోనే ఉన్నారని చెప్పారు. అవినీతి మరక లేని నేతలను మాత్రమే కాంగ్రెస్‌లోకి తీసుకుంటామని తేల్చిచెప్పారు.

డబ్బు ఉన్న నేతలు పార్టీలోకి వస్తే తమకు ఎలా వాడుకోవాలో తెలుసునని అన్నారు. క్యాబినెట్ విస్తరణపై తనకు సమాచారం లేదన్నారు. ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు దళిత బంధు తెచ్చారు తప్పా దళితులపై ప్రేమతో కాదని చెప్పారు. భవిష్యత్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలు మునిగినట్లేనని అన్నారు. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎంపీని కూడా లోక్ సభ ఎన్నికల్లో గెలవదని చెప్పారు. కాంగ్రెస్ 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఐఎం తమతోనే ఉందని.. తాము ఎంఐఎంతో కలిస్తే 72 సీట్లు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం ఎవరిది ఉంటే ఎంఐఎం వారితో ఉంటుందన్నారు. భువనగిరి నుంచి బీసీ‌కి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తనదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 07:19 PM