Share News

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు నేటితో ఏడాది.. ప్రజల స్పందన ఇదీ..

ABN , Publish Date - Apr 10 , 2024 | 10:18 AM

సికింద్రాబాద్‌(Secunderabad) - తిరుపతి(Tirupati) మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) ప్రారంభమై నేటికి ఏడాదైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమలకు(Tirumala) వెళ్లే భక్తుల పాలిట ఇదొక వరంగా మారింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ప్రారంభ రైలుకు గతేడాది ఏప్రిల్‌ 8న ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) జెండా ఊపగా, ఏప్రిల్‌ 10నుంచి పూర్తిస్థాయిలో ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణికులకు..

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు నేటితో ఏడాది.. ప్రజల స్పందన ఇదీ..
Vande Bharat Express

హైదరాబాద్, ఏప్రిల్‌ 10: సికింద్రాబాద్‌(Secunderabad) - తిరుపతి(Tirupati) మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) ప్రారంభమై నేటికి ఏడాదైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమలకు(Tirumala) వెళ్లే భక్తుల పాలిట ఇదొక వరంగా మారింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ప్రారంభ రైలుకు గతేడాది ఏప్రిల్‌ 8న ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) జెండా ఊపగా, ఏప్రిల్‌ 10నుంచి పూర్తిస్థాయిలో ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణికులకు అందుబాట్లోకి వచ్చాయి. ప్రతిరోజూ ఉదయం 6.15గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి, మధ్యాహ్నం 2.34గంటలకల్లా (కేవలం 8.19 గంటల్లో) తిరుపతికి చేరుతోంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.15గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి రాత్రి 11.30గంటలకు సికింద్రాబాద్‌కు వస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుతూ ఆధ్యాత్మిక పర్యాటకానికి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎంతగానో దోహడపడుతోందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

టికెట్‌ ధర ఎక్కువే అయినా..

ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్గమధ్యంలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. చైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1,680 ఉండగా, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.3,080గా ఉంది. రైలులోనే బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, టీ, కాఫీ, ఇతర స్నాక్స్‌ను ప్రయాణికులకు అందజేస్తున్నారు. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి సాధారణ రైళ్లలో ఏసీ క్లాస్‌ టికెట్ల ధరతో పోల్చితే.. వందేభారత్‌ టికెట్‌ ధరలు ఎక్కువే. అయినప్పటికీ, ప్రయాణ సమయం తక్కువగా ఉండడంతో వెంకన్న భక్తుల ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది.

తిరుగు ప్రయాణంలో ఇక్కట్లు..

తిరుగు ప్రయాణంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుండడంతో.. సరైన రవాణా సదుపాయాలు లేక తమ ఇళ్లకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వందేభారత్‌ వచ్చే సమయానికి ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ సిటీ బస్‌ సర్వీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మార్గంలో రాత్రి వేళల్లో ప్రయాణించేందుకు వీలుగా స్లీపర్‌ బెర్తులుండే వందే భారత్‌లను ప్రవేశపెడితే మరింత ఆదరణ లభిస్తుందని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రయాణికుల్లో వృద్ధులు 11శాతమే..

దక్షిణ మధ్య రైల్వే తాజాగా వెల్లడించిన సమాచారం మేరకు.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న వారిలో 56శాతానికి పైగా ప్రయాణికులు యువతీ యువకులే. మరీ ముఖ్యంగా 25 నుంచి 34 ఏళ్ల లోపు వయసున్న వారు 29.08 శాతం, 35-49 ఏళ్ల లోపు వారు 26.85 శాతం మంది వందేభారత్‌లో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. 60 ఏళ్ల వయసున్న సీనియర్‌ సిటిజన్లు కేవలం 11.81 శాతం మందే కావడం గమనార్హం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 10:18 AM