Share News

BJP: 65 శాతం ముస్లింలకు మోదీ పథకాలతో లబ్ది: కొండా విశ్వేశ్వరరెడ్డి

ABN , Publish Date - Mar 01 , 2024 | 01:54 PM

హైదరాబాద్: 65 శాతం మంది ముస్లింలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పథకాలతో లబ్ది చేకూరుతుందని.. కొత్త ప్రభుత్వం చేతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం చిప్ప పెట్టిపోయిందని, ఎఫ్ఆర్‌బీఎం పరిధి మించిపోయినా కొత్తగా అప్పు తీసుకునేందుకు మోదీ అవకాశం ఇచ్చారని అన్నారు. బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

BJP: 65 శాతం ముస్లింలకు మోదీ పథకాలతో లబ్ది: కొండా విశ్వేశ్వరరెడ్డి

హైదరాబాద్: 65 శాతం మంది ముస్లిం (Muslim)లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) పథకాలతో లబ్ది చేకూరుతుందని బీజేపీ (BJP) నేత కొండా విశ్వేశ్వరరెడ్డి (Konda Visweswara Reddy) వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం చేతిలో బీఆర్ఎస్ (BRS) సర్కార్ చిప్ప పెట్టిపోయిందని, ఎఫ్ఆర్‌బీఎం (FRBM) పరిధి మించిపోయినా కొత్తగా అప్పు తీసుకునేందుకు మోదీ అవకాశం ఇచ్చారని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా నడుస్తోందంటే కారణం ప్రధానేనని, పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) మోదీకి ఓటేయాలని మేము గర్వంగా అడుగుతామన్నారు.

గ్రామీణ అభివృద్ధి కూడా మోదీ వల్లనే జరుగుతోందని, రూ. 9 వేల కోట్ల అప్పు ఇవ్వలేకపోతే రాష్ట్రం చీకట్లోకి వెళ్ళేదని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ (Congress) వాళ్ళు రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఓటేయాలని అడగలేరని, తెలంగాణలో బీజేపీకి ఎక్కువ సీట్లు ఇస్తే నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలిస్తే కాంగ్రెస్‌లో చేరతున్నారని దుష్ప్రచారం చేశారని, సీఎం, మంత్రులు మోదీని కలిసినందున.. వారు కూడా బీజేపీలో చేరతారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై చర్చ చేస్తున్నారు.. కానీ చర్యలు తీసుకోవడం లేదని, కాళేశ్వరం మొత్తం వదిలేసి కేవలం మేడిగడ్డను పట్టుకున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌ను కాపాడుతోందని, బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తులు ఉండవని.. మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలో బీజేపీ 2 లక్షల మెజారిటీ ఓట్లతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మాటలను ఆ పార్టీ అధిష్టానం వినడం లేదని, కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని అంటున్నా.. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఒప్పుకోవడం లేదన్నారు. తనకు చేవెళ్ళ టికెట్ వచ్చినా.. రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని.. టికెట్ ఇస్తామని తనకు కూడా ఎవరూ ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేదని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 01:56 PM