Share News

Rail Nilayam: నకిలీ ఇంటర్వ్యూలు, నియామక పత్రాలు

ABN , Publish Date - May 20 , 2024 | 04:01 AM

రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్‌ నిలయం అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు.

Rail Nilayam: నకిలీ ఇంటర్వ్యూలు, నియామక పత్రాలు

  • రైల్వే, ప్రభుత్వ ఉద్యోగాల పేరిట భారీ మోసం

  • లక్షలు వసూలు చేసి ఉడాయిస్తున్న మోసగాళ్లు

  • రైల్‌ నిలయం వేదికగా కార్యకలాపాలు

  • సహకరిస్తున్న కొందరు సిబ్బంది, అధికారులు

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్‌ నిలయం అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు. సికింద్రాబాద్‌ కేంద్రంగా పరిపాలన కార్యకలాపాలు నిర్వహిస్తున్న రైల్‌ నిలయంలో పని చేస్తున్న కొంత మంది కిందిస్థాయి సిబ్బంది, అధికారులు ఈ మోసగాళ్లతో కుమ్మక్కైనట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరి మోసాలను అడ్డుకునే యంత్రాంగం లేకపోవడంతో అమాయకులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాట్సాప్‌ గ్రూపులు, వెబ్‌సైట్ల నుంచి నిరుద్యోగుల ఫోన్‌ నెంబర్లు సేకరించి మోసగాళ్లు వల విసరుతున్నారు. రైల్వేతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు విభాగాల్లో ఖాళీలను, బ్యాక్‌లాగ్‌లను భర్తీ చేస్తున్నారని మభ్యపెడుతున్నారు. ఆయా సంస్థల పేరిట నకిలీ లేఖలు సృష్టించి ఇంటర్య్వూలు నిర్వహించి, హాజరైనవారికి నకిలీ నియామక పత్రాలు కూడా అందించటం విశేషం. రూ.10-15 లక్షల వరకు వసూలు చేసుకొని ఉడాయిస్తున్నారు.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రాంతాలకు సంబంధించిన నిరుద్యోగులను కూడా వీరు మోసగించినట్లు తెలుస్తోంది. రైల్వేలో టీటీఈ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికిన ముఠా సభ్యులు హైదరాబాద్‌ కందికల్‌ భట్‌జీనగర్‌ ప్రాంతంలోని ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.12 లక్షలకు బేరం కుదర్చుకున్నారు. అయితే, రైల్వేలో టీటీఈ ఉద్యోగ నియామకాలు జరగడం లేదని ఆ అభ్యర్థి తెలుసుకొని వారిని నిలదీయటంతో, వాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. రైల్వేలో లేదు కానీ, కావాలంటే తమిళనాడు రాష్ట్ర ఎజీ (ఆకౌంటెంట్‌ జనరల్‌) కార్యాలయంలో ఎల్‌డీసీ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. ఈ మేరకు ముఠా సభ్యుడు అనిల్‌కుమార్‌ ఓ ఫేక్‌ లెటర్‌తో చెన్నైలో సదరు నిరుద్యోగికి ఇంటర్య్వూ ఏర్పాటు చేశాడు. నాలుగు రోజుల పాటు అక్కడే ఉంచి ‘నియామకపత్రాన్ని’ కూడా అందించాడు. ఒప్పందం మేరకు డబ్బులు తీసుకున్నాడు. రెండు వారాల వ్యవధిలో ఉద్యోగంలో చేరడానికి మళ్లీ సమాచారం ఇస్తామని చెప్పి పంపించారు. కానీ, నెల గడిచినా సమాచారం లేకపోవడంతో బాధితుడు.. తమిళనాడు ఎజీ కార్యాలయానికి వెళ్లి చూపగా అది నకిలీదని తేలింది. అనిల్‌కుమార్‌కు ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. దీంతో మోసపోయినట్టు తెలుసుకుని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఈ ఒక్క వ్యక్తికే పరిమితం కాలేదని, ఆదాయపన్ను శాఖలో ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్స్‌, రైల్వేలో క్లర్క్‌, టీటీఈ తదితర ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి ఈ ముఠా భారీ మొత్తంలో వసూలు చేసినట్టు సమాచారం.

Updated Date - May 20 , 2024 | 04:01 AM