Share News

IPL 2024: కెప్టెన్‌గా రోహిత్, వైస్ కెప్టెన్‌గా హార్దిక్.. ముంబైకి యువీ కీలక సూచన

ABN , Publish Date - Mar 14 , 2024 | 10:30 AM

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రానున్న ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను తప్పించడంపై పెద్ద దుమారమే రేగుతోంది.

IPL 2024: కెప్టెన్‌గా రోహిత్, వైస్ కెప్టెన్‌గా హార్దిక్.. ముంబైకి యువీ కీలక సూచన

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రానున్న ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను తప్పించడంపై పెద్ద దుమారమే రేగుతోంది. అత్యధిక మంది హిట్‌మ్యాన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. పైగా ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో కూడా టీమిండియాను రోహితే నడిపించనున్నాడు. అలాంటిది రోహిత్‌ను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై స్పందించాడు. ఈ విషయంలో యువీ రోహిత్‌కు మద్దతుగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను మరో ఏడాది కొనసాగించాలని చెప్పిన యువీ.. హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌ను చేయాలని సూచించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడం చాలా పెద్ద నిర్ణయం అని అన్నాడు.


ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ కెప్టెన్‌గా 5 సార్లు ఐపీఎల్ విజేత. అలాంటిది అతన్ని తొలగించడం చాలా పెద్ద నిర్ణయం. నేనైతే హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చినట్టే ఒకరిని చేర్చుకుంటాను. కానీ రోహిత్ శర్మను మరో సీజన్ కెప్టెన్‌గా కొనసాగిస్తాను. హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా చేస్తాను. అప్పుడు మొత్తం ఫ్రాంచైజీ ఎలా పని చేస్తుందో చూద్దాం. అయితే ఫ్రాంచైజీ దృక్కోణం నుంచి చూస్తే నేను అర్థం చేసుకున్నాను. వారు ఫ్రాంచైజీ భవిష్యత్‌ గురించి ఆలోచించాలి. కానీ రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. బ్యాటర్‌గానూ బాగా ఆడుతున్నాడు. కాబట్టి ముంబై తీసుకున్న నిర్ణయం చాలా పెద్దది. ప్రతిభ పరంగా చూస్తే హార్దిక్ పాండ్యాకు గొప్ప ప్రతిభ ఉంది. అయితే గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉండడం, ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉండడం వేరు. ముంబై ఇండియన్స్ పెద్ద జట్టు. 5 సార్లు ట్రోఫీ గెలిచింది. దీంతో చాలా అంచనాలు ఉంటాయి. ’’ అని యువీ పేర్కొన్నాడు. కాగా రానున్న ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 10:30 AM