Share News

IND vs ENG: కీపర్‌గా కిషన్, బ్యాటర్‌గా రాహుల్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు వ్యూహం మార్చిన టీమిండియా!

ABN , Publish Date - Jan 11 , 2024 | 02:44 PM

భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 25 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా టీమిండియా ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.

IND vs ENG: కీపర్‌గా కిషన్, బ్యాటర్‌గా రాహుల్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు వ్యూహం మార్చిన టీమిండియా!

భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 25 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా టీమిండియా ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసమే కీలక ఆటగాళ్లకు అఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చింది. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్లు ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. పలు నివేదికల ప్రకారం ఈ టెస్ట్ సిరీస్‌లో ఇషాన్ కిషన్‌ను స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా బరిలోకి దించనున్నారని సమాచారం. కేఎల్ రాహుల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. ఇటీవల భారత జట్టుకు రాహుల్ వికెట్ కీపర్ కమ్ మిడిలార్డర్ బ్యాటర్‌గా వ్యవహరిస్తున్నాడు. కీలకమైన వన్డే ప్రపంచకప్‌లో కీపర్‌గా, బ్యాటర్‌గా రాహుల్ సత్తా చాటాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లోనూ రాహులే కీపర్‌గా వ్యవహరించాడు. బ్యాట్‌తోనూ సెంచరీ సాధించాడు.


దీంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లోనూ టీమిండియా వికెట్ కీపర్‌గా రాహులే ఉంటాడని అంతా భావించారు. కానీ భారత్‌లోని పిచ్‌లలో టర్న్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌తో బరిలోకి దిగితే బాగుంటుందని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోందట. అందుకే కిషన్‌ను స్పెషలిస్ట్ కీపర్‌గా ఆడించాలని భావిస్తుందని సమాచారం. దీంతో కీలకమైన ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా వ్యూహం మార్చినట్టుగా తెలుస్తోంది. అయితే కిషన్‌ను ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయాలంటే అతను ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఆడాల్సి ఉంది. కాగా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు, అఫ్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు కిషన్ జట్టులో లేడు. సెలెక్టర్లు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని, అందుకే ఎంపిక చేయలేదనే వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఖండించాడు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి కిషన్ విశ్రాంతి కోరాడని, అప్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండేది లేనిది చెప్పలేదని, అందుకే ఎంపిక చేయలేదని చెప్పాడు. అయితే కిషన్ అందుబాటులోకి వచ్చాక దేశవాళీ క్రికెట్ ఆడతాడని పేర్కొన్నాడు. కాగా గతేడాది జరిగిన వెస్టిండీస్ పర్యటన ద్వారా ఇషాన్ కిషన్ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 02:45 PM