Share News

IND vs AFG: తొలి టీ20 మ్యాచ్‌కు పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..?

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:59 PM

గురువారం నుంచి భారత్, అప్ఘానిస్థాన్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ మొహాలీ వేదికగా నేడు జరగనుంది. సిరీస్‌లో ఫెవరేట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా తొలి మ్యాచ్‌లో శుభారంభం చేయడం పెదగా కష్టం కాకపోవచ్చు.

IND vs AFG: తొలి టీ20 మ్యాచ్‌కు పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..?

మొహాలీ: గురువారం నుంచి భారత్, అప్ఘానిస్థాన్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ మొహాలీ వేదికగా నేడు జరగనుంది. సిరీస్‌లో ఫెవరేట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా తొలి మ్యాచ్‌లో శుభారంభం చేయడం పెదగా కష్టం కాకపోవచ్చు. అలా అని అఫ్ఘానిస్థాన్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మధ్యలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఆ జట్టు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. గతేడాది భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో సత్తా చాటింది. ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను ఓడించి సెమీస్ రేసులో నిలిచింది. దీంతో టీ20 సిరీస్‌లో టీమిండియాకు అప్ఘానిస్థాన్ జట్టు షాక్ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిన అవరసం ఉంది. చాలా కాలం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో చేరడం శుభపరిణామం. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగే మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం పిచ్ రిపోర్టు ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం.


మొహాలీ సాధారణంగా బ్యాటింగ్ పిచ్. ఇక్కడ గతంలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు రావొచ్చు. మ్యాచ్ ఆరంభంలో పేసర్లకు, ఆట సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు పిచ్ అనుకూలించే అవకాశాలున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో మంచు ఎక్కువగా కురుస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటే చేజింగ్ చేసిన జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో కూడా ఇదే జరిగింది. మొహాలీలో ఇప్పటివరకు 6 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరగగా, 4 సార్లు చేజ్ చేసిన జట్లే గెలిచాయి. అందులో రెండుసార్లు 200కుపైగా లక్ష్యాలను చేధించాయి. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో మరింత వేగం పెరిగిన నేపథ్యంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచే అవకాశాలు తక్కువనే చెప్పుకోవాలి. దీంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 200 నుంచి 220 మధ్య పరుగులు సాధిస్తే ఎంత బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ లక్ష్య చేధన కష్టం అయ్యే అవకాశాలుంటాయి. దీంతో టీమిండియాకు మొదట బ్యాటింగ్ వస్తే 200+ పరుగులు చేయడం మంచిది.

ప్రస్తుతం మొహాలీలో చలి ఎక్కువగా ఉండడంతో రెండు జట్ల ఆటగాళ్లకు వాతావరణం నుంచి సవాల్ తప్పదు. మొహాలీలో టీమిండియా 4 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అందులో 3 గెలవగా, ఒకటి ఓడిపోయింది. 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమి ఎదురైంది. ఏది ఏమైనా బ్యాటింగ్ పిచ్ కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇక మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. కాగా పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఒకసారి కూడా అప్ఘానిస్థాన్ చేతిలో టీమిండియా ఓడిపోలేదు. ఆడిన ఐదింటిలో 4 గెలవగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

Updated Date - Jan 11 , 2024 | 12:59 PM