Share News

IND vs ENG: ఐదో టెస్టులో టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు

ABN , Publish Date - Mar 09 , 2024 | 08:13 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టుపై భారత్ పట్టుబిగించింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు కలిసికట్టుగా రాణించడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. టాప్ 5 బ్యాటర్లు 50+ స్కోర్లతో దుమ్ములేపారు.

IND vs ENG: ఐదో టెస్టులో టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు

ధర్మశాల: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టుపై భారత్ పట్టుబిగించింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు కలిసికట్టుగా రాణించడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. టాప్ 5 బ్యాటర్లు 50+ స్కోర్లతో దుమ్ములేపారు. అందులో ఇద్దరు సెంచరీలు కూడా బాదారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఈ క్రమంలో టీమిండియా ఖాతాలో ఓ అరుదైన రికార్డు కూడా చేరింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రోహిత్ సేన తమ మొదటి ఇన్నింగ్స్‌లో 473/8 పరుగులు చేసింది. క్రీజులో కుల్దీప్ యాదవ్(27), జస్ప్రీత్ బుమ్రా (19) ఉన్నారు. వీరిద్దరు చివరి వికెట్‌కు అజేయంగా 45 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు ఇప్పటికే 255 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. మరో 2 వికెట్లు చేతులు ఉండడంతో ఆధిక్యం ఇంకా పెరగనుంది.


ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా టాప్ 5 బ్యాటర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ 50+ స్కోర్లు సాధించారు. రోహిత్ శర్మ(103), శుభ్‌మాన్ గిల్(110) సెంచరీలు సాధించగా.. దేవదత్ పడిక్కల్(65), యశస్వీ జైస్వాల్ (57), సర్ఫరాజ్ ఖాన్ (56) హాఫ్ సెంచరీలు సాధించారు. మొదట యశస్వీ జైస్వాల్ ఆ తర్వాత రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ 50+ స్కోర్ సాధించారు. ఈ క్రమంలో భారత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌పై భారత టాప్ 5 బ్యాటర్లు 50+ స్కోర్లు సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మొత్తంగా నాలుగోసారి మాత్రమే కావడం గమనార్హం. అలాగే 14 ఏళ్ల తర్వాత మళ్లీ టీమిండియా టాప్ 5 బ్యాటర్లు 50+ స్కోర్లు సాధించారు. మొట్టమొదటగా 1998లో కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత టాప్ 5 బ్యాటర్లు 50+ స్కోర్లు సాధించారు. ఆ తర్వాత 1999లో మొహాలీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మళ్లీ ఈ ఘనత సాధించింది. ఆ తర్వాత 10 ఏళ్లకు 2009లో ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా టాప్ 5 బ్యాటర్లు 50+ స్కోర్లు సాధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2024 | 08:13 AM