Share News

IND vs ENG: అశ్విన్‌పై సరికొత్త రికార్డు నెలకొల్పిన జో రూట్.. ఆ దేశ దిగ్గజ బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టి మరి..

ABN , Publish Date - Feb 23 , 2024 | 03:22 PM

శుక్రవారం నుంచి మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జోరూట్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

IND vs ENG: అశ్విన్‌పై సరికొత్త రికార్డు నెలకొల్పిన జో రూట్.. ఆ దేశ దిగ్గజ బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టి మరి..

రాంచీ: శుక్రవారం నుంచి మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జోరూట్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. భారతదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంలో తన దేశానికే చెందిన దిగ్గజ ఆటగాడు అలీస్టర్ కుక్ రికార్డును బద్దలకొట్టాడు. భారతదేశంలో అశ్విన్‌పై 44 సగటుతో కుక్ 314 పరుగులు చేశాడు. ప్రస్తుతం కుక్‌ను రూట్ అధిగమించాడు. రూట్, కుక్ తర్వాత 204 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ మూడో స్థానంలో.. 193 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నారు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆటలో టీ విరామ సమయానికి 198/5 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(67), బెన్ ఫోక్స్ (28) ఉన్నారు. 37 ఓవర్లపాటు సాగిన రెండో సెషన్‌లో 86 పరుగులురాగా ఒక వికెట్ పడింది. అంతకుముందు తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ వణికించాడు. వెంటవెంటనే 3 వికెట్లు తీయడంతో 57 పరుగులకే ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయింది. 10వ ఓవర్‌లో బెన్ డకెట్(11), ఒల్లీ పోప్(0)ను పెవిలియన్ చేర్చిన ఆకాష్ దీప్.. 12వ ఓవర్లో ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న జాక్ క్రాలే(42)ను ఔట్ చేశాడు. ఈ సమయంలో రూట్, బెయిర్‌స్టో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ స్కోర్ 100 దాటింది. అయితే ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న బెయిర్‌స్టోను(38)ను 22వ ఓవర్‌లో అశ్విన్ లెగ్‌బైస్‌లో ఔట్ చేశాడు. దీంతో తొలి సెషన్‌లోనే ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయింది.

రెండో సెషన్ మొదటి ఓవర్లోనే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(3)ను రవీంద్ర జడేజా సింగిల్ డిజిట్‌కే ఔట్ చేశాడు. దీంతో 112 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌ను వెటరన్ బ్యాటర్ జోరూట్, బెన్ ఫోక్స్ ఆదుకున్నారు. ఇంగ్లండ్ బాజ్‌బాల్ వ్యూహానికి విరుద్ధంగా నిదానంగా ఆడిన వీరిద్దరు వికెట్లకు అడ్డుగోడలా నిలిచారు. దీంతోరెండో సెషన్‌లో భారత బౌలర్లు పరుగులు కట్టడి చేసినప్పటికీ మరో వికెట్ సాధించలేకపోయారు. ఈ క్రమంలో రూట్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో రూట్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. రూట్, ఫోక్స్ కలిసి ఆరో వికెట్‌కు 113 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీబ్రేక్ అనంతరం మొదలైన మూడో సెషన్ ఆరంభంలోనే హాఫ్ సెంచరీని చేరువ అవుతున్న ఫోక్స్(47)ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో రూట్, ఫోక్స్ భాగస్వామ్యాన్ని తెరపడింది. 225 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2024 | 03:23 PM