Share News

IND vs ENG: ఇంగ్లండ్‌పై చరిత్ర సృష్టించిన అశ్విన్.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడిగా..

ABN , Publish Date - Feb 23 , 2024 | 02:47 PM

ఇంగ్లండ్‌తో మొదలైన నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఔట్ చేయడం ద్వారా టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు.

IND vs ENG: ఇంగ్లండ్‌పై చరిత్ర సృష్టించిన అశ్విన్.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడిగా..

రాంచీ: ఇంగ్లండ్‌తో మొదలైన నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఔట్ చేయడం ద్వారా టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అలాగే టెస్టుల్లో ఇంగ్లండ్‌పై బ్యాటర్‌గా వెయ్యికిపైగా పరుగులు చేయడంతోపాటు 100 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. క్రికెట్ ఆడే ఆసియా దేశాల నుంచి ఇంగ్లీష్ జట్టుపై ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. కాగా 43 ఇన్నింగ్స్‌ల్లో అశ్విన్ ఈ రికార్డును అందుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే ఇంగ్లీష్ జట్టుపై ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్ మాజీ ఆటగాడు సర్ గార్ఫీల్డ్ సోబర్స్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు మాంటీ నోబుల్, గిఫెన్ కూడా ఈ రికార్డును అందుకున్నాడు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆటలో టీ విరామ సమయానికి 198/5 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(67), బెన్ ఫోక్స్ (28) ఉన్నారు. 37 ఓవర్లపాటు సాగిన రెండో సెషన్‌లో 86 పరుగులురాగా ఒక వికెట్ పడింది. అంతకుముందు తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ వణికించాడు. వెంటవెంటనే 3 వికెట్లు తీయడంతో 57 పరుగులకే ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయింది. 10వ ఓవర్‌లో బెన్ డకెట్(11), ఒల్లీ పోప్(0)ను పెవిలియన్ చేర్చిన ఆకాష్ దీప్.. 12వ ఓవర్లో ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న జాక్ క్రాలే(42)ను ఔట్ చేశాడు. ఈ సమయంలో రూట్, బెయిర్‌స్టో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ స్కోర్ 100 దాటింది. అయితే ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న బెయిర్‌స్టోను(38)ను 22వ ఓవర్‌లో అశ్విన్ లెగ్‌బైస్‌లో ఔట్ చేశాడు. దీంతో తొలి సెషన్‌లోనే ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్ మొదటి ఓవర్లోనే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(3)ను రవీంద్ర జడేజా సింగిల్ డిజిట్‌కే ఔట్ చేశాడు. దీంతో 112 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌ను వెటరన్ బ్యాటర్ జోరూట్, బెన్ ఫోక్స్ ఆదుకున్నారు. ఇంగ్లండ్ బాజ్‌బాల్ వ్యూహానికి విరుద్ధంగా నిదానంగా ఆడిన వీరిద్దరు వికెట్లకు అడ్డుగోడలా నిలిచారు. దీంతోరెండో సెషన్‌లో భారత బౌలర్లు పరుగులు కట్టడి చేసినప్పటికీ మరో వికెట్ సాధించలేకపోయారు. ఈ క్రమంలో రూట్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో రూట్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2024 | 02:50 PM