Share News

IND vs ENG: వందో టెస్టులో తిప్పేసిన అశ్విన్.. ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ చిత్తు

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:14 PM

చివరిదైన ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ధర్మశాల టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.

IND vs ENG: వందో టెస్టులో తిప్పేసిన అశ్విన్.. ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ చిత్తు

ధర్మశాల: చివరిదైన ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ధర్మశాల టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. గత మ్యాచ్‌ల మాదిరిగానే చివరి టెస్టులోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపిన టీమిండియా అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. 259 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్.. భారత స్పిన్నర్ల ధాటికి 48.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 195 పరుగులకే కుప్పకూలింది. జోరూట్ ఒక్కడే 84 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. వందో టెస్టు మ్యాచ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్ కీలకమైన 5 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్లు తీసిన అశ్విన్ మొత్తం 9 వికెట్లతో తన వందో టెస్టును చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను రోహిత్ సేన 4-1తో కైవసం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌లో ఓడిన భారత జట్టు ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. మిగతా 4 టెస్టులను వరుసగా గెలిచింది. విశాఖ, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరిగిన టెస్టుల్లో ఘనవిజయాలు నమోదుచేసింది. భారత్ విజయాల్లో యువ క్రికెటర్లు కీలకపాత్ర పోషించారు.

259 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను సెకండ్ ఓవర్‌లోనే టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బ తీశాడు. ఓపెనర్ బెన్ డకెట్‌ను 2 పరుగులకే ఔట్ చేశాడు. ఆ కాసేపటికే మరో ఓపెనర్ జాక్ క్రాలేను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఓలీ పోప్(19)ను కూడా త్వరగా పెవిలియన్ చేర్చాడు. దీంతో 36 పరుగులకే ఇంగ్లండ్ టాప్ 3 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌ను జోరూట్, జానీ బెయిర్‌స్టో ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 56 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని 18వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ విడదీశాడు. ధాటిగా ఆడి 3 ఫోర్లు, 3 సిక్సులతో 31 బంతుల్లోనే 39 పరుగులు చేసిన బెయిర్‌స్టోన్‌ను లెగ్‌బైస్‌లో పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్(2)ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో లంచ్ విరామ సమయానికి 103 పరుగులకే ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది.


లంచ్ అనంతరం రెండో సెషన్ మొదలైన కాసేటికే మరోసారి చెలరేగిన అశ్విన్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్(8)ను పెవిలియన్ చేర్చాడు. కాసేపటి తర్వాత ఒకే ఓవర్‌లో టామ్ హార్ట్‌లీ(20), మార్కు వుడ్(0)ను బుమ్రా లెగ్‌బైస్‌లో ఔట్ చేశాడు. దీంతో 141 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఓటమి అంచున నిలిచింది. అయితే ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరోవైపు జోరూట్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలోనే తన టెస్టు కెరీర్‌లో 61వ హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. షోయబ్ బషీర్ సహకారంతో ఇంగ్లండ్ వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నాడు. అయితే 46వ ఓవర్‌లో షోయబ్ బషీర్‌(13)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేయడంతో 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటి తర్వాత 84 పరుగులు చేసిన రూట్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ భారీ షాట్ కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీంతో 195 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్ 5, బుమ్రా, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు.. జడేజా ఒక వికెట్ తీశారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో జాక్ క్రాలే (79) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగాడు. అశ్విన్ 4 వికెట్లతో సత్తా చాటగా.. జడేజా ఒక వికెట్ తీశాడు. అనంతరం టీమిండియా బ్యాటర్లు కూడా చెలరేగారు. కెప్టెన్ రోహిత్ శర్మ(103), వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్(110) సెంచరీలతో దుమ్ములేపారు. యశస్వీ జైస్వాల్(57), దేవదత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 477 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత జట్టుకు మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5 వికెట్లతో చెలరేగాడు. టామ్ హార్ట్‌లీ, జేమ్స్ అండర్సన్ రెండేసి వికెట్లు తీయగా.. స్టోక్స్ ఒక వికెట్ తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Viral Video: ఇలాంటి క్యాచ్ నబూతో.. నభవష్యతి.. మీరు క్రికెట్ ఫ్యాన్స్ అయితే కచ్చితంగా చూడాల్సిందే..

IND vs ENG: ఐదో టెస్టులో టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు



Updated Date - Mar 09 , 2024 | 02:23 PM