Share News

IND vs ENG: భారీ అధిక్యం దిశగా టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

ABN , Publish Date - Jan 26 , 2024 | 02:34 PM

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ అధిక్యం దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్‌పై భారత జట్టు 63 పరుగుల అధిక్యంలో నిలిచింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.

IND vs ENG: భారీ అధిక్యం దిశగా టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ అధిక్యం దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్‌పై భారత జట్టు 63 పరుగుల అధిక్యంలో నిలిచింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(45), కేఎస్ భరత్(9) ఉన్నారు. పరుగులు చేయగల సత్తా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. కాగా ఓవర్‌నైట్ స్కోర్ 119/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. సెంచరీ సాధిస్తాడనుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి రోజు ఆటకు మరో 4 పరుగులు మాత్రమే జోడించి 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. జైస్వాల్‌ను జోరూట్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 123 పరుగుల వద్ద భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌(23)ను టామ్ హర్ట్‌లీ పెవిలియన్ చేర్చాడు. కొంతకాలంగా టెస్టుల్లో రాణించలేకపోతున్న గిల్ మరోసారి నిరాశపరిచాడు. దీంతో 159 పరుగులకు టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది.


ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కలిసి నాలుగో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 200 దాటింది. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(55), శ్రేయాస్ అయ్యర్ (34) ఉన్నారు. లంచ్ బ్రేక్ అనంతరం టీమిండియా ఆరంభంలోనే శ్రేయాస్ అయ్యర్(35) వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో టామ్ హర్ట్‌లీకి క్యాచ్ ఇచ్చి శ్రేయస్ పెవిలియన్ చేరాడు. అనంతరం రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన కేఎల్ రాహుల్ టీమిండియాను అధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ దశలో రాహుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ టామ్ హార్ట్‌లీ వేసిన 65వ ఓవర్‌లో రెహాన్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ ఔట్ అయ్యాడు. దీంతో 288 పరుగులకు టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. 8 ఫోర్లు, 2 సిక్సులతో రాహుల్ 86 పరుగులు చేశాడు. అనంతరం కేఎస్ భరత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన జడేజా జట్టు స్కోర్‌ను 300 దాటించాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Updated Date - Jan 26 , 2024 | 02:34 PM