Share News

Lok Sabha Polls 2024: బీజేపీకి సవాల్‌గా మారిన సుల్తాన్‌పూర్.. అఖిలేష్ వ్యూహం ఫలిస్తుందా..!

ABN , Publish Date - May 22 , 2024 | 09:31 AM

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉండటం ఒకటైతే.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి నేతలు ఈ రాష్ట్రం నుంచి పోటీచేస్తుండటంతో యూపీ రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తులే కాకుండా ఎంతోమంది ప్రముఖులు యూపీలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారు.

Lok Sabha Polls 2024: బీజేపీకి సవాల్‌గా మారిన సుల్తాన్‌పూర్.. అఖిలేష్ వ్యూహం ఫలిస్తుందా..!
Akhilesh Yadav

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉండటం ఒకటైతే.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి నేతలు ఈ రాష్ట్రం నుంచి పోటీచేస్తుండటంతో యూపీ రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తులే కాకుండా ఎంతోమంది ప్రముఖులు యూపీలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో హై ప్రొఫైల్‌ సీటుగా భావించే సుల్తాన్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది.


సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా ఇండియా కూటమి నుంచి ఎస్పీ అభ్యర్థి రామ్‌భూల్‌ నిషాద్‌ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గానికి ఆరో దశలో మే25న పోలింగ్ జరగనుంది. ఈ సీటును గెల్చుకునేందుకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రత్యేక వ్యూహం రూపొందించారు. బీజేపీలో హైప్రొఫైల్ కలిగిన వ్యక్తులను ఓడించడం కోసం ఈసారి ఇండియా కూటమి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే వారణాసి మినహా యూపీలో 79 సీట్లు ఇండియా కూటమి గెలవబోతుందని అఖిలేష్ యాదవ్ ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా సుల్తాన్‌పూర్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు చంద్రభద్ర సింగ్‌ను అఖిలేష్ యాదవ్ ఎస్పీలో చేర్చుకున్నారు. తద్వారా సుల్తాన్‌పూర్‌లో గెలవాలని ఎస్పీ లక్ష్యంగా పెట్టుకుంది.

PM Modi: 'ఇండి' కూటమి పాపాలతో దేశం పురోగమించ లేదు: మోదీ


ఎస్పీలోకి చంద్రభద్ర సింగ్..

సుల్తాన్‌పూర్ జిల్లా ఇసౌలీ మాజీ ఎమ్మెల్యే చంద్రభద్ర సింగ్ అలియాస్ సోను సింగ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ ప్రాంతంలో ఆయన బలమైన నేతగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సుల్తాన్‌పూర్‌ నుంచి బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీకి గట్టిపోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మేనకా గాంధీ కేవలం 14,526 ఓట్ల తేడాతో గెలిచారు. ఆమెకు 4,59,196 ఓట్లు రాగా, చంద్రభద్రకు 4,44,670 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీల మధ్య ఓట్ల తేడా ఒక శాతం మాత్రమే. దీంతో చంద్రభద్రను తమ పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు.. కాంగ్రెస్‌తో పొత్తు ఉండటం ద్వారా ఈ ఎన్నికల్లో సుల్తాన్‌పూర్ సీటును గెలుచుకోవచ్చని ఎస్పీ అంచనా వేస్తోంది. మాజీ ఎమ్మెల్యే చంద్రభ ద్ర సింగ్ గతంలో ఎస్పీలో పనిచేశారు. గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్ర భద్ర తొలిసారిగా ఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత ఆయన బీఎస్పీలో చేరారు, యూపీలో రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు బీఎస్పీకి రాజీనామా చేసి.. గత కొంతకాలంగా అన్ని పార్టీలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా సుల్తాన్‌పూర్‌లో ఎన్నికల పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఆయన ఎస్పీలో చేరారు.


ఠాకూర్‌ ఓట్లపై పట్టు..

చంద్ర భద్ర సింగ్ ఠాకూర్ సామాజిక వర్గానికి చెందినవారు. సుల్తాన్‌పూర్‌లో ఠాకూర్ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఆయన మద్దతు దారులు నియోకవర్గం పరిధిలో ఎక్కువుగానే ఉన్నారు. ఠాకూర్‌ సామాజిక వర్గం ఓట్లపై ఆయనకు గట్టి పట్టు ఉందన్న అంచనాతో ఎస్పీ ఆయనను పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వడంతో పాటు రెండో స్థానంలో నిలిచారు. చంద్రభధ్ర చేరికతో సుల్తాన్‌పూర్‌ను గెలుచుకోవచ్చని ఎస్పీ ధీమాతో ఉంది.


ఎవరి ప్రభావం ఎంత..?

సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానంలో మొత్తం 18 లక్షల 34 వేల 355 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 20 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. 22 శాతం మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్లు కాగా.. ఠాకూర్లు, బ్రాహ్మణులతో పాటు, పెద్ద సంఖ్యలో OBCలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలతో పాటు ఓబీసీ ఓటర్లలో కూడా చంద్రభద్ర సింగ్‌కు పట్టుందని ఎస్పీ భావిస్తోంది. ఎన్నికల పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు చంద్రభద్ర సింగ్‌ ఎస్పీలో చేరడం బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీకి పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీఎస్పీ నుంచి ఉదయ్ రాజ్ వర్మన్ బరిలోకి దిగడంతో ఇప్పటికే ఈ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొంది. త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.


Lok Sabha elections 2024: ఐదో దశలో తగ్గిన పోలింగ్ శాతం.. 2019తో పోలిస్తే తగ్గిందా, పెరిగిందా?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - May 22 , 2024 | 09:31 AM