Share News

PM Modi: దేశంలోనే మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో.. నేడు ప్రారంభించనున్న మోదీ

ABN , Publish Date - Mar 06 , 2024 | 08:46 AM

2024 లోక్‌సభ ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మోదీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలతో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

PM Modi: దేశంలోనే మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో.. నేడు ప్రారంభించనున్న మోదీ

కోల్‌కతా: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మోదీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలతో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం, మంగళవారం తెలంగాణలో పర్యటించిన మోదీ వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే నేడు కోల్‌కతాలో(Kolkata) పర్యటించనున్న మోదీ రూ.15,400 కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మించిన నీటి అడుగున నడిచే మెట్రో రైలును (అండర్ రివర్ మొట్రో రైలు) ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మధ్య 16.6 కిలో మీటర్ల మేర మెట్రోమార్గాన్ని నిర్మించగా.. ఇందులో 10.8 కి.మీ. భూగర్భంలోనే ఉంది.


హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కి.మీ. మేర ఉన్న లైన్‌లో భాగంగా 520 మీటర్ల పొడవు గల అండర్‌వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని మెట్రోరైలు 45 సెకన్లలోనే పూర్తి చేస్తుంది. ఈ సొరంగాన్ని నదీ గర్భానికి 16 మీటర్ల లోతులో, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో నిర్మించారు. ఈ సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లుగా.. బాహ్య వ్యాసం 6.1 మీటర్లుగా ఉంది. హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లడానికి ప్రస్తుతం 90 నిమిషాల సమయం పడుతోంది. అండర్‌వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. ఈ అండర్ వాటర్ మెట్రో రైలు నడిచే మార్గంలో మొత్తం ఆరు స్టేషన్లు ఉండగా.. అందులో మూడు భూగర్భంలోనే ఉన్నాయి. ఈ అండర్ వాటర్ మెట్రో రైలు ప్రయాణ దూరాన్ని తగ్గించడంతోపాటు కోల్‌కతా వాసులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. దీంతోపాటు కోల్‌కతాలోని మరిన్ని మెట్రో మార్గాలను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంబించనున్నారు. హౌరా మైదాన్-ఎస్ల్పానేడ్ మెట్రో మార్గం, కవి సుభాస్-హమంత ముఖోపాధ్యాయ మెట్రో మార్గం, తరటాలా-మజెర్‌హట్ మెట్రో మార్గం, రూబీ హాల్ క్లినిక్- రాంవాడి మెట్రో మార్గం వంటి తదితర మెట్రో లైన్‌లను ప్రధాని ప్రారంభించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2024 | 08:52 AM