Share News

Lok Sabha Elections: బీజేపీతో సీట్ల షేరింగ్‌లో ఎలాంటి సమస్య లేదు: కుమారస్వామి

ABN , Publish Date - Feb 23 , 2024 | 06:25 PM

కర్ణాటక నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సీట్ల షేరింగ్ విషయంలో బీజేపీతో ఎలాంటి సమస్యలు లేవని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను తాను, తన కుమారుడు నిఖిల్ న్యూఢిల్లీలో కలిసామని, సీట్ల షేరింగ్‌పై చర్చలు జరిపామని చెప్పారు.

Lok Sabha Elections: బీజేపీతో సీట్ల షేరింగ్‌లో ఎలాంటి సమస్య లేదు: కుమారస్వామి

బెంగళూరు: కర్ణాటక (Karnataka) నుంచి లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections) పోటీకి సీట్ల షేరింగ్ విషయంలో బీజేపీ (BJP)తో ఎలాంటి సమస్యలు లేవని జేడీఎస్ (JDS) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను తాను, తన కుమారుడు నిఖిల్ న్యూఢిల్లీలో కలిసామని, సీట్ల షేరింగ్‌పై చర్చలు జరిపామని చెప్పారు.


''బీజేపీతో పొత్తుపై ఎలాంటి సమస్యలు లేవు. సీట్ల షేరింగ్ విషయంలోనూ లేవు. రాష్ట్రంలోని మొత్తం 28 సీట్లను గెలుచుకోవాలన్నదే మా కూటమి లక్ష్యం'' అని శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ కుమారస్వా్మి చెప్పారు. తన సమీప బంధువు, ప్రముఖ కార్డియాక్ సర్జన్ మంజునాథ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంపై అడిగినప్పుడు, మంజునాథ్‌పై అందరికీ మంచి అభిప్రాయం ఉందని, ఆయన సర్జన్‌గా రాష్ట్ర ప్రజలకు, వైద్యరంగానికి సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఆ కారణంగానే ఆయనను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారని, దానిపై తామింకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా మంజూనాథ్‌ను నిలబెడతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.


సిద్ధరామయ్యపై మండిపాటు

రాష్ట్రానికి నిధులను డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై లేజిస్లేటివ్ కౌన్సిల్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రసంగాన్ని కుమారస్వామి తప్పుపట్టారు. కర్ణాటక రాష్ట్రాన్ని అడుక్కుతినే రాష్ట్రంగా చేయాలని సిద్ధరామయ్య అనుకుంటున్నారా అని ప్రశ్నంచారు. కర్ణాటక సంపన్న రాష్ట్రమని, సొంతంగా టాక్స్ రెవెన్యూ ఉందని, దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తోందని అన్నారు. రాష్ట్రానికి ఎలాంటి నిధుల కొరత లేదన్నారు. అయితే రాష్ట్రాన్ని లూఠీ చేయాలని అధికార పక్షం భావిస్తున్నందు వల్లే ఖజానా ఖాళీ అవుతోందని ఆరోపించారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ఘర్షణ వైఖరిని అవలంభిస్తోందని తప్పుపట్టారు. వైద్యులు తనను విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతోనే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

Updated Date - Feb 23 , 2024 | 06:25 PM