Share News

AP Elections: పిఠాపురంలో గెలిచేదెవరు.. ప‌వ‌న్ కు ల‌క్ష మెజార్టీ వ‌స్తుందా..?

ABN , Publish Date - Mar 27 , 2024 | 09:24 AM

పిఠాపురం.. ఈ పేరు ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు హ‌ట్ టాపిక్‌.. రాజ‌కీయమంతా పిఠాపురం చుట్టూ తిరుగుతోంది. కార‌ణం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండ‌ట‌మే. నియోజక వర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు పిఠాపురం నియోజ‌క‌ వ‌ర్గంలో 14 మంది ఎమ్మెల్యేలుగా ప‌ని చేశారు.

AP Elections: పిఠాపురంలో గెలిచేదెవరు.. ప‌వ‌న్ కు ల‌క్ష మెజార్టీ వ‌స్తుందా..?
Pawan Kalyan

పిఠాపురం.. ఈ పేరు ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు హ‌ట్ టాపిక్‌.. రాజ‌కీయమంతా పిఠాపురం చుట్టూ తిరుగుతోంది. కార‌ణం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండ‌ట‌మే. నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో 14 మంది ఎమ్మెల్యేలుగా ప‌ని చేశారు. అయినా ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని స‌మ‌స్యలు ప‌ట్టి పీడిస్తున్నాయి. గొల్లప్రోలు, ఎస్‌.కొత్తపల్లి, పిఠాపురం మండ‌లాలు ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్నాయి. 2ల‌క్షల 36వేల 602 మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో కాపులు 32 శాతం మంది. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన శెట్టిబ‌లిజ‌లు 9.7 శాతం మంది. ఇత‌ర బీసీ కులాలు 11 శాతం మంది. ఎస్సీ, ఎస్టీలు 3 శాతం మంది. క్షత్రియులు 2శాతం. 14 మంది ఎమ్మెల్యేలుగా ప‌ని చేస్తే 12 మంది కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారున్నారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థి పెండెం దొర‌బాబు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంతోమంది పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వ‌హించినా.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు.

AP Politics: సంక్షేమ పాలన కోసం టీడీపీని గెలిపించాలి: వసంత కృష్ణ ప్రసాద్

సుదీర్ఘ చరిత్ర

పిఠాపురానికి సుదీర్ఘ చారిత్రక నేప‌థ్యం ఉంది. దేశంలో గ‌ల 18 శ‌క్తి పీఠాల్లో ఇదొక‌టి. ఎన్నో ప్రసిద్ధిగాంచిన ఆల‌యాల కేంద్రం పిఠాపురం. ఇక్కడి శ‌క్తిపీఠం ద‌ర్శనానికి దేశం న‌లుమూల నుంచి భ‌క్తులు వ‌స్తుంటారు. గ‌త ద‌శాబ్ధకాలంగా నాయ‌కులు హామీఇస్తున్నా.. కొత్తపల్లి నుంచి ఉప్పాడ మధ్య రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తికలేదు. ప్రస్తుతం పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగా గీత గ‌త ఐదేళ్లుగా కాకినాడ ఎంపీగా ఉన్నారు. అంత‌కు ముందు రాజ్యసభ స‌భ్యురాలిగా ప‌ని చేశారు. అయినా ఈ స‌మ‌స్యను పరిష్కరించలేకపోయారు. చిత్రాడ చెరువు వ్యర్థాలతో నిండిపోయింది. పూడిక తీసి దీనిని సుంద‌రీక‌రించాల‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్రజలు కోరుతున్నారు.

ఎన్నో సమస్యలు..

పిఠాపురం పట్టణంలో ర‌హ‌దారులు చిన్నవి కావ‌డంతో విప‌రీతంగా ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. ర‌హ‌దారులను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడి స్థానికులు కోరుతున్నారు. ఈ స‌మ‌స్యను ఇప్పటివరకు ప‌ని చేసిన ఎమ్మెల్యేలు ప‌ట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామ‌ని గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యే హామీ ఇచ్చినా నెర‌వేర్చలేదనే ప్రజలు అంటున్న మాట. 65 వేల ఎక‌రాలు ఏలేరు కాల్వ కింద సాగ‌వుతుంది. 30 ఏళ్లుగా ఈ ఆయ‌క‌ట్టు ఆధునీక‌ర‌ణ చేప‌ట్టలేదు. దీంతో రెండో పంట‌కు నీరు రావ‌డం లేదు. కాలువల్లో పూడిక తీయించాలని, గుర్రపు డెక్కను తొలగించాలని రైతులు వేడుకుంటున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసే వ‌ర్షాల‌కు ఇక్కడి భూములు మునిగిపోతున్నా ప‌ట్టించుకునే నాయ‌కుడు క‌ర‌వ‌య్యాడు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం సెజ్ పేరుతో 12 వేల ఎక‌రాల భూమిని ప్రభుత్వం సేక‌రించింది. ఇక్కడ ఇప్పటివరకు ఒక ప‌రిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాయ‌కుల భూ ఆక్రమణలు పెరిగిపోయయనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ ర‌హ‌దారికి స‌మీపంలో 12 కోట్ల రూపాయిల‌ విలువైన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి వైసీపీకి చెందిన నేతలు దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దందాల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోయిందనే విమర్శలు వైసీపీ నాయకులపై ఉన్నాయి.

Andhra Pradesh Elections: ఓటమి భయం.. ప్రలోభాల పర్వం.. వైసీపీ నేతల బరి తెగింపు!

ఎవరి బలమెంత?

ఈ ఎన్నికల్లో వంగా గీత వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థితో పాటు వైసీపీ అభ్యర్థి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు. 2009లో ప్రజారాజ్యం పార్టీ త‌ర‌పున‌ పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీత గెలుపొందారు. కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు 91వేలు ఉన్నాయి. దీంతో పవన్ గెలుపు పక్కా అనే టాక్ వినిపిస్తోంది. పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలు జనసేన వైపు ఉన్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. నియోజకవర్గంలో సమస్యలను పవన్ తీర్చగలరనే నమ్మకంతో ఇక్కడి ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జ‌న‌సేన అభ్య‌ర్థి భారీ మెజార్టీతో గెలిచే అవ‌కాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

లక్ష మెజార్టీ వస్తుందా..

పవన్ కళ్యాణ్ ఇటీవల పిఠాపురం నాయకులతో సమావేశం సందర్భంగా తనకు లక్ష మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో పవన్‌కు లక్ష మెజార్టీ వస్తుందా అనే చర్చ సాగుతోంది. కార్యకర్తలో జోష్ నింపేందుకు పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. వాస్తవానికి పవన్ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి గెలుస్తారని అనేక సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు మెజార్టీ భారీగా వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దాదాపు 30 వేల నుంచి 50 వేల మెజార్టీ వచ్చే అవకాశం ఉందనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలు పవన్ గెలుస్తారా.. మెజార్టీ ఎంత అనేది జూన్4న తేలనుంది.

AP News: ఎన్నికల నిబంధనలు ఆ నలుగురు అధికారులకి వర్తించవా?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 11:20 AM