Share News

Memantha Siddham: జనం లేని జగన్‌ యాత్ర!

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:08 AM

మేమంతా సిద్ధం’ పేరుతో బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం జగన్‌కు అన్నమయ్య జిల్లా ప్రజలు గట్టి దెబ్బే కొట్టారు.

Memantha Siddham: జనం లేని జగన్‌ యాత్ర!

  • రోడ్డు షో వెలవెల.. పోలీసులు ..

  • సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువ

  • పలు గ్రామాల్లో ఆగకుండా వెళ్లిన బస్సు

  • నమస్కారాలు.. చేతులు ఊపడంతో సరి

  • బహిరంగ సభకు వెయ్యి ఆర్టీసీ బస్సులు

  • పలు జిల్లాల నుంచి జనాల తరలింపు

  • రూ.300, బిర్యానీ, మద్యం పంపిణీ

  • సీఎం ప్రసంగం మొదలవగానే జనం జంప్‌

  • ఎన్నికల నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘన

రాయచోటి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ‘మేమంతా సిద్ధం’ (Memantha Siddham) పేరుతో బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం జగన్‌కు (CM YS Jagan) అన్నమయ్య జిల్లా ప్రజలు గట్టి దెబ్బే కొట్టారు. మంగళవారం అన్నమయ్య జిల్లా ములకలచెరువు నుంచి కురబలకోట మండలం వరకు సుమారు 45 కిలోమీటర్లు సాగిన బస్సుయాత్రకు జనం కరువయ్యారు. దీంతో రోడ్డు షో వెలవెల పోయింది. జగన్‌ బస్సు చుట్టూ.. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువగా కనిపించారు. బస్సుయాత్ర సాగిన మార్గంలోని పలు గ్రామాల వద్ద జనం లేకపోవడంతో.. బస్సును ఆపకుండా వెళ్లిపోయారు. కొన్నిచోట్ల అంతంతమాత్రంగానే ఉన్న జనాన్ని చూసి సీఎం జగన్‌ బస్సు నుంచి కిందకు దిగి వారిని పలకరించారు. మిగిలిన చోట్ల బస్సులో నుంచే ప్రజలకు నమస్కారాలు చేశారు. గాలిలో చేతులు ఊపడాలతోనే సరిపెట్టారు. జగన్‌ బస్సు వెంట వచ్చిన వాహనాల కారణంగా.. గంటల పాటు వాహనాలతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరోవైపు మంగళవారం సాయంత్రం మదనపల్లెలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగసభకు మూడు నాలుగు జిల్లాల నుంచి దాదాపు 1000కి పైగా ఆర్టీసీ బస్సుల్లో జనాలను తరలించారు. అయితే, జగన్‌ ప్రసంగం ప్రారంభం అయ్యీ అవ్వకముందే.. గ్యాలరీల నుంచి జనం బయటకు వెళ్లిపోయారు. ఇక, అధికారపార్టీ నేతలు యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు.

మాయ చేద్దామనుకున్న జగన్‌కు భారీ ఝలక్‌

చడీచప్పుడు లేని వైనం

శ్రీ సత్యసాయి-అన్నమయ్య జిల్లా సరిహద్దులో సోమవారం రాత్రి బసచేసిన ప్రాంతం నుంచి మంగళవారం ఉదయం 10.30 గంటలకు జగన్‌ బస్సు యాత్ర బయలుదేరింది. సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు జగన్‌ బస్సులోనే ఉండిపోయారు. ములకలచెరువు మండలంలో ఎక్కడా బస్సుపైకి ఎక్కలేదు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు. బస్సులో నుంచి బయటకు రాకపోవడంతో ప్రజలు, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. దీంతో మేమంతా సిద్ధం బస్సుయాత్ర చడీచప్పుడు లేకుండానే సాగిపోయింది. పెద్దపాళ్యం, వేపూరికోటలలో బస్సులో నుంచి జగన్‌ బయటకు వచ్చి బస్సు మెట్లమీద నుంచే మాట్లాడారు. కొన్నిచోట్ల కిందకు దిగి.. గంటల కొద్దీ వేచి ఉన్న వారిని అరనిముషంలో పలకరించి బస్సెక్కేశారు. ఇదే పరిస్థితి బి.కొత్తకోట, కురబలకోట మండలాల్లోనూ కనిపించింది.

జాతీయ రహదారిపై ఇక్కట్లు

బస్సుయాత్రకు జనం పెద్దగా రాకపోయినా.. పోలీసులు భద్రత పేరుతో ట్రాఫిక్‌ను నియంత్రించారు. దీంతో జాతీయరహదారిపైన ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మదనపల్లె నుంచి ములకలచెరువు వరకు ట్రాఫిక్‌ను మళ్లించారు. బెంగళూరు నుంచి కడపకు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించడంతో.. ప్రయాణికులు అదనంగా 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్పి వచ్చింది. రోడ్డుపక్కనే పెద్దపెద్ద వాహనాలు నిలపడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కర్ణాటక ఆర్టీసీ బస్సు ప్రయాణీకులు ఆందోళన చేయడంతో.. పోలీసులు వారికి సర్దిచెప్పారు.

మద్యం, డబ్బు పంపకాలు

బస్సుయాత్రకు వచ్చిన వాళ్లకు అధికారపార్టీ నేతలు జోరుగా మద్యం, డబ్బు పంపిణీ చేశారు. సభకు ప్రజలను తరలించడానికి వైసీపీ నేతలు పెద్దఎత్తున డబ్బులు పంపిణీ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మున్సిపాలిటీలలో ఒక్కో వార్డుకు, ఒక్కో పంచాయతీకి రూ.లక్ష ఇచ్చినట్టు సమాచారం. పెద్ద వార్డులు, మేజర్‌ పంచాయతీలకు రూ.లక్షన్నర నుంచి 2 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. సభకు వచ్చే మహిళకు రూ.300, మధ్యాహ్నం బిర్యానీ ప్యాకెట్‌, పురుషులకు డబ్బుతోపాటు మద్యం పంచారు. ఈ యాత్రకు పలు జిల్లాల నుంచి సుమారు 1000కి పైగా ఆర్టీసీ బస్సుల్లో జనాలను తరలించారు. ఆర్టీసీ బస్సులకు వైసీపీ జెండాలు, బోర్డులు పెట్టారు. బస్సు యాత్ర దారిపొడవునా జెండాలు కట్టారు. వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా.. అధికారులు పట్టించుకోలేదని పలువురు విమర్శిస్తున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 08:28 AM